సవాల్ చేసి వెనక్కి తగ్గారు.. చర్చకు దమ్ముంటే అసెంబ్లీ పెట్టండి: కేటీఆర్
- చర్చకు సవాల్ చేసిన కాంగ్రెస్ నేతలే వెనక్కి తగ్గారని కేటీఆర్ విమర్శ
- హరీశ్రావు అరెస్టును ఖండిస్తూ వెంటనే విడుదల చేయాలని డిమాండ్
- అప్పులు, గురుకులాల అంశంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్
- తన లెక్కలు తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న మంత్రి జూపల్లి
గన్పార్క్కు వెళుతున్న మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడాన్ని కేటీఆర్ ఖండించారు. ప్రభుత్వానికి ఏ అంశంపైనా బహిరంగ చర్చ చేపట్టే ధైర్యం లేదని ఆరోపించారు. హరీశ్రావు సహా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ముందే అన్ని వాస్తవాలు చెప్పాలని భావించినా ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు.
రాష్ట్ర అప్పులు, గురుకులాల్లో అవినీతిపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. స్పీకర్ ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో చర్చకు అవకాశం కల్పించాలని కోరారు.
మరోవైపు గన్పార్క్ వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తన సవాల్ కేటీఆర్, హరీశ్రావులకు కాదని తెలిపారు. నేరుగా కేసీఆర్కేనని స్పష్టం చేశారు. తాను చెప్పిన అప్పుల లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు.