సాయికృష్ణ కేసు... నిందితులకు రిమాండ్... ఏలూరు జైలుకు నాని, మచిలీపట్నం జైలుకు అశోక్!
- సాయి కృష్ణ కస్టడీ డెత్ కేసులో కీలక పరిణామం
- ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు జులై 14 వరకు రిమాండ్
- సోమవారం అధికారుల ఎదుట లొంగిపోయిన పోలీసులు
రౌడీషీటర్ సాయికృష్ణను మే 6న నాన్ బెయిలబుల్ వారెంట్ల (NBW) కింద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులు అతడిని అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని, అనంతరం మృతదేహాన్ని మాయం చేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగి నెలలు గడుస్తున్నా, సాయికృష్ణ ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాకపోవడం గమనార్హం.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.ఎస్.వి.వి. నాగరాజును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా, తాజాగా లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లను విచారించిన క్రమంలో వారు కీలక అంశాలపై మౌనం వహించినట్లు తెలుస్తోంది. ఐజీ ఎం. రవిప్రకాశ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసులో లోతైన విచారణ జరుపుతోంది. అక్రమ నిర్బంధం, హత్య, సాక్ష్యాల ధ్వంసం (సీసీటీవీ ఫుటేజీ తొలగింపు) వంటి తీవ్రమైన అభియోగాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
కోర్టు ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ అశోక్ను మచిలీపట్నం జైలుకు, జంగం నానిని ఏలూరు జైలుకు తరలించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం కావడంతో, ప్రభుత్వం నిష్పక్షపాత విచారణ నిమిత్తం సిట్ను రంగంలోకి దించింది.