ముంబై మొహర్రం ఊరేగింపులో భారీ కుట్ర భగ్నం... 15,000 మందిని చంపేందుకు యత్నం!
- నిందితుడి నుంచి 14,900 విషపూరిత క్యాప్సూల్స్ స్వాధీనం
- 15,000 మందిని చంపాలన్నదే తన లక్ష్యమని నిందితుడి వాంగ్మూలం
- నొప్పి నివారణ మందులని చెప్పి ఎలుకల మందు పంపిణీ
- సకాలంలో స్పందించి భారీ ప్రాణనష్టాన్ని నివారించిన పోలీసులు
వివరాల్లోకి వెళితే, శుక్రవారం రాత్రి ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో మొహర్రం ఊరేగింపు ప్రశాంతంగా సాగుతోంది. ఈ క్రమంలో పుణెకు చెందిన ఫయాజ్ ప్రేమ్జీ (39) అనే పెయింట్ వ్యాపారి, ఊరేగింపులో పాల్గొంటున్న వారికి కొన్ని క్యాప్సూల్స్ పంపిణీ చేయడం ప్రారంభించాడు. అవి నొప్పి నివారణ మందులని నమ్మబలికాడు. అయితే, అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
నిందితుడు పంపిణీ చేస్తున్నవి సాధారణ మాత్రలు కావని, వాటిలో జింక్ ఫాస్ఫైడ్ అనే తీవ్రమైన విషపూరిత ఎలుకల మందు నింపి ఉందని గుర్తించారు. అతని వద్ద నుంచి సుమారు 14,900 విషపూరిత క్యాప్సూల్స్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తన క్రూరమైన పథకాన్ని అంగీకరించాడు. "నేను కనీసం 15,000 మందిని చంపాలనుకున్నాను" అని చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ దారుణం కోసం నిందితుడు గత 15 రోజులుగా ముంబైలోనే ఉంటూ పథక రచన చేసినట్లు తేలింది. ఆన్లైన్ ద్వారా 50 కిలోల జింక్ ఫాస్ఫైడ్, 30,000 ఖాళీ క్యాప్సూల్స్ను కొనుగోలు చేసి, వాటిలో విషాన్ని నింపినట్లు గుర్తించారు.
తెల్లవారుజామున 4 గంటల సమయంలో, నిందితుడు ఇచ్చిన క్యాప్సూల్ తీసుకున్న సల్మాన్ అనే వ్యక్తి వాంతులు, కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఈ ఘటనకు, నిందితుడికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. పోలీసుల సత్వర స్పందనతో భారీ ప్రాణనష్టం తప్పిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ జోన్-I) జయంత్ మీనా తెలిపారు. ఈ ఘటనలో స్వల్ప అస్వస్థతకు గురైన మరికొందరికి చికిత్స అందించగా, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
బైకుల్లా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి ఏవైనా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా, అతని విదేశీ ప్రయాణాల వివరాలు, ఈ కుట్ర వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు. మొహర్రం ఊరేగింపుల సందర్భంగా భారీ జనసందోహం ఉంటుందన్న ఉద్దేశంతోనే నిందితుడు ఈ దాడికి ప్రణాళిక రచించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.