వెలిగొండ నిర్వాసితులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి.. భావోద్వేగభరిత వాతావరణం

Chandrababu Naidu meets Veligonda project evacuees in emotional interaction
  • వెలిగొండ నిర్వాసితులతో ముగిసిన సీఎం ముఖాముఖి
  • తమ కష్టాలు గుర్తించింది చంద్రబాబేనంటూ కన్నీళ్లు పెట్టుకున్న బాధితులు
  • గతంలో పునరావాసం అడిగితే అరెస్టులు చేశారంటూ రైతుల ఆవేదన
  • 2351 మందికి రూ.300 కోట్ల పునరావాస నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
  • నిర్వాసితుల త్యాగానికి తగ్గ ఫలితం ఇస్తానని ముఖ్యమంత్రి భరోసా
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం ఆద్యంతం భావోద్వేగభరిత వాతావరణంలో సాగింది. మార్కాపురం జిల్లా దోర్నాల పర్యటనలో భాగంగా ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం సీఎం, యర్రగొండపాలెంలో నిర్వాసితులు, రైతులతో నేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వాసితులు తమ దశాబ్దాల కష్టాలను, గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న వేధింపులను ఏకరువు పెడుతూ కన్నీటిపర్యంతమయ్యారు.

"మా బాధలు పట్టించుకుని, పరిష్కారం చూపింది చంద్రబాబే" అంటూ సుంకేశుల గ్రామానికి చెందిన దూదేకుల ఖాసీం వలీ అనే నిర్వాసితుడు సీఎం ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు పునరావాసం కల్పించేందుకు ఏకంగా ముఖ్యమంత్రే రూ.300 కోట్లతో రావడం తమ అదృష్టమని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తమకు జరిగిన అన్యాయాన్ని పలువురు రైతులు గుర్తు చేసుకున్నారు. పునరావాసం కల్పించాలని కోరినందుకు తమపై అక్రమ కేసులు బనాయించి, అరెస్టులు చేసి వేధించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ హక్కులను కాలరాసి, జైల్లో పెట్టారని వాపోయారు.

ప్రభుత్వం ఇప్పుడు పునరావాస ప్యాకేజీ కింద నిధులు విడుదల చేయడంతో తమ పిల్లల చదువులు, భవిష్యత్తుపై భరోసా కలిగిందని మరో నిర్వాసితుడు హనుమ ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. తమ 30 ఏళ్ల కల నెరవేరుతోందంటూ కొందరు రైతులు సీఎంకు పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించగా, చంద్రబాబు వారిని వారించి ఆపారు.

నిర్వాసితుల ఆవేదనను సావధానంగా విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, వారికి పూర్తి భరోసా కల్పించారు. "నాలుగు జిల్లాల తలరాతలు మార్చే ఈ ప్రాజెక్టు కోసం మీరు చేసిన త్యాగం వెలకట్టలేనిది. మీ త్యాగానికి తగ్గ ఫలితాలు అందించే బాధ్యత నాది. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా, ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే గ్యారెంటీ నేను ఇస్తున్నా" అని ఆయన స్పష్టం చేశారు.

వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 7,225 మంది నిర్వాసితులు ఉండగా, గత ప్రభుత్వం కేవలం 96 మందికి మాత్రమే ఆర్ అండ్ ఆర్ నిధులు అందించిందని అధికారులు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం శనివారం నాడు 2,351 మంది నిర్వాసితులకు రూ.300 కోట్ల మేర ఆర్ అండ్ ఆర్ నిధులను అందించింది. ఈ కార్యక్రమంలో మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల రైతులు, నిర్వాసితులు పాల్గొన్నారు. సీఎం నేరుగా రైతుల మధ్యనే కూర్చొని వారితో మాట్లాడటం విశేషం.
Chandrababu Naidu
Veligonda Project
Veligonda Project Evacuees
Andhra Pradesh R and R Package
Markapuram Dornala Visit
Yerragondapalem Farmers Meet

More Telugu News