హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు ఎండీగా అజిత్ రెడ్డి
- ప్రస్తుతం ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా కొనసాగుతున్న అజిత్ రెడ్డికి అదనపు బాధ్యతలు
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ
- మెట్రో ఫేజ్-2 విస్తరణ ప్రయత్నాల మధ్య ఈ నియామకం ప్రాధాన్యం
2012 బ్యాచ్కు చెందిన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ (ఐడీఈఎస్) అధికారి అయిన అజిత్ రెడ్డికి, రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలలో భాగంగా ఈ కొత్త బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ నగరంలో పట్టణ రవాణా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే క్రమంలో ఈ నియామకం అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ప్రస్తుతం సర్ఫరాజ్ అహ్మద్ హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై మెట్రో రైలు విస్తరణపై చర్చించారు. మెట్రో ఫేజ్-1 వాల్యుయేషన్, ఫేజ్-2 విస్తరణ ప్రణాళికల కోసం ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ (ఎస్బీఐక్యాప్స్)ను కన్సల్టెంట్గా నియమించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.