వచ్చే ఏడాది భారత్కు ట్రంప్.. రూబియో కీలక ప్రకటన
- వచ్చే ఏడాది భారత్లో ట్రంప్ పర్యటనకు అవకాశం
- ఏర్పాట్ల కోసం ఈ ఏడాది రూబియో భారత్కు వచ్చే యోచన
- మోదీ-ట్రంప్లది అద్భుతమైన అనుబంధమన్న రూబియో
- భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తుది దశలో ఉందని వెల్లడి
- మోదీ నేతృత్వంలో భారత్ ప్రపంచ శక్తిగా ఎదిగిందన్న రూబియో
ఈ ఏడాది చివర్లో తాను భారత్కు వచ్చి ట్రంప్ పర్యటన ఏర్పాట్లను ఖరారు చేసే అవకాశం ఉందని రూబియో వెల్లడిడించారు. వాషింగ్టన్లో ఐఏఎన్ఎస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్ అమెరికాకు అత్యంత సన్నిహిత భాగస్వామి, మిత్రదేశమని పేర్కొన్నారు. ట్రంప్ తన తొలి హయాంలో 2020 ఫిబ్రవరిలో భారత్కు వచ్చిన విషయం తెలిసిందే.
ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా మోదీ, ట్రంప్ సమావేశమయ్యారని రూబియో గుర్తు చేశారు. ఇద్దరు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధం దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందని చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కూడా తుది దశకు చేరుకుందని వెల్లడించారు. చర్చలు సానుకూలంగా సాగుతున్నాయన్నారు. ఒప్పందం పూర్తి కావడానికి ఇంకొన్ని అడుగుల దూరంలోనే ఉన్నామని తెలిపారు.
క్వాడ్ దేశాల తదుపరి సమావేశం కోసం కూడా ఎదురుచూస్తున్నట్లు రూబియో తెలిపారు. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ శక్తిగా ఎదిగిందని ప్రశంసించారు. ఇంధన రంగంలోనూ ఇరు దేశాల మధ్య సహకారం మరింత పెరుగుతోందన్నారు. భారీ క్రూడ్ ఆయిల్ను శుద్ధి చేసే సామర్థ్యం ఉన్న కీలక దేశాల్లో భారత్ ఒకటని పేర్కొన్నారు.