అమరావతికి కొత్త ఊపు.. బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణంలో వేగం పెంచండి.. సీఆర్డీఏ అధికారులకు చంద్రబాబు ఆదేశం
- రాజధాని అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశం
- డిజిటల్ మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచన
- నివాస వ్యయం తగ్గించి, ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం
- ప్రకాశం బ్యారేజీ వద్ద జలక్రీడలతో పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు
- సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష
సమావేశంలో ప్రధానంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన అనుమతుల ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. బ్యాంక్ స్ట్రీట్లో కార్యాలయాల ఏర్పాటుకు 13 బ్యాంకులు ముందుకు రాగా, వాటిలో 11 సంస్థలు తమ భవన నిర్మాణ బాధ్యతలను సీపీడబ్ల్యూడీకి అప్పగించాయని అధికారులు సీఎంకు వివరించారు. ఈ నిర్మాణాలను పూర్తి సమన్వయంతో వేగంగా పూర్తి చేసేలా చూడాలని సీఆర్డీఏ అధికారులకు సూచించారు.
రాజధానిలో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఫోన్, కేబుల్, ఇంటర్నెట్ వంటి కనెక్టివిటీ సేవల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో డిజిటల్ వసతులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అమరావతిని కేవలం నిర్మించడమే కాకుండా, నివాస వ్యయాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు, ఇండక్షన్ స్టవ్ల వాడకాన్ని ప్రోత్సహించడం, డిస్ట్రిక్ట్ కూలింగ్ వంటి ఆధునిక వ్యవస్థలను అందుబాటులోకి తేవడం ద్వారా ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
రాజధాని సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు చెప్పారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం వరకు ఏడాది పొడవునా నీరు నిల్వ ఉండేలా చూడటం ద్వారా పర్యాటక అభివృద్ధికి అపార అవకాశాలు ఉంటాయని అన్నారు. జల క్రీడలు, స్విమ్మింగ్ వంటి కార్యకలాపాలను ప్రోత్సహించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో కృష్ణా కరకట్ట నిర్మాణం, ఉండవల్లిలో ఎల్పీఎస్ లేఅవుట్ల అభివృద్ధి, పార్కింగ్ కాంప్లెక్స్, జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణం వంటి ఇతర అంశాలపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ వర్చువల్గా పాల్గొనగా, మున్సిపల్, సీఆర్డీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.