రాహుల్ పీఎం, రేవంత్ మరోసారి సీఎం కావడం ఖాయం: కడియం శ్రీహరి
- స్టేషన్ ఘన్ పూర్ లో ఘనంగా రాహుల్ జన్మదిన వేడుకలు
- కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ కేక్ కట్ చేసిన కడియం శ్రీహరి
- కేసీఆర్ కు ప్రజలు ఎలాంటి గుణపాఠం చెప్పారో అందరం చూశామని వ్యాఖ్య
- మోద ప్రభుత్వానికి కూడా అదే రీతిలో బుద్ధి చెబుతారన్న శ్రీహరి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బర్త్డే సెలబ్రేషన్స్లో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ కేక్ కట్ చేసిన కడియం.. దేశ, రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాబోయే రోజుల్లో దేశానికి రాహుల్ గాంధీ పీఎం కావడం, ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కావడం వంద శాతం పక్కా అని కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
"తెలంగాణలో మాకు ఇక ఎదురే లేదు, తిరుగే లేదు అన్నట్లు అహంకారంతో వ్యవహరించిన కేసీఆర్కు రాష్ట్ర ప్రజలు ఎలాంటి గుణపాఠం చెప్పారో మనమంతా చూశాం. రానున్న రోజుల్లో కేంద్రంలోని బీజేపీ, మోదీ ప్రభుత్వానికి కూడా దేశ ప్రజలు అదే రీతిలో బుద్ధి చెప్పడం ఖాయం" అని అన్నారు. దేశంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను రాహుల్ గాంధీ ఒంటరిగా ఎండగడుతున్నారని కొనియాడారు. అంబేద్కర్ స్ఫూర్తితో దేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకు, అణగారిన వర్గాల బాధితులకు అండగా ఉంటూ పార్లమెంట్లో రాహుల్ గళం విప్పుతున్నారని ప్రశంసించారు.