షబ్బీర్ అలీకి నోటీసులు ఇచ్చాం: మల్లు రవి
- ఎంతటి వారైనా సరే వ్యక్తిగత సమస్యలను పార్టీపై రుద్దవద్దన్న మల్లు రవి
- క్రమశిక్షణ కమిటీ ముందు షబ్బీర్ ఆదివారం హాజరవుతారని వెల్లడి
- నేతలు క్షమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకోబోమని హెచ్చరిక
తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విబేధాలు రచ్చకెక్కడంతో అధిష్ఠానం సీరియస్ అయింది. ఎంతటి వారైనా సరే తమ వ్యక్తిగత సమస్యలను తెచ్చి పార్టీపై రుద్దవద్దని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి హెచ్చరికలు జారీ చేశారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డిల అంశంపై స్పందించారు.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి నోటీసులు జారీ చేశామని, ఆయన ఆదివారం కమిటీ ముందు హాజరవుతారని మల్లు రవి తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాతే తుది నిర్ణయం ఉంటుందన్నారు. నేతలకు ఏమైనా సమస్యలు ఉంటే టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లేదా రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లాలే తప్ప క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే మల్లు రవిని కలిసి నోటీసులపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు.