ప్రతి హార్ట్ పేషెంట్ కు స్టెంట్ వేయాల్సిన అవసరం లేదు!
- స్టెంట్లు, బైపాస్ సర్జరీ సాధ్యం కాని గుండె రోగులకు ఈఈసీపీ ఒక ప్రత్యామ్నాయ చికిత్స
- శరీరంలో సహజంగానే కొత్త రక్తనాళాలు ఏర్పడటానికి ఈ థెరపీ సహాయం
- శస్త్రచికిత్స లేకుండా కాళ్లకు కఫ్స్ బిగించి చికిత్స
- ఇది ఎఫ్డీఏ ఆమోదం పొందిన సురక్షితమైన చికిత్సా విధానం
- ఛాతీ నొప్పి తగ్గి, గుండె పనితీరు మెరుగుపడే అవకాశం
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం... తీవ్రమైన గుండెనొప్పితో బాధపడే రోగులకు ఈ చికిత్స ఒక వరమని చెప్పవచ్చు. సరైన మందులు, చికిత్సలు తీసుకున్నప్పటికీ ఛాతీ నొప్పి తగ్గని రోగులు ఎందరో ఉన్నారని బెంగళూరులోని ఆస్టర్ ఆర్వీ ఆసుపత్రి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జి. డింపు ఎడ్విన్ జోనాథన్ తెలిపారు. స్టెంట్లు లేదా శస్త్రచికిత్సలు నిర్వహించడానికి వీలులేని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్ రోగులకు ఈఈసీపీ ఒక ప్రభావవంతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
చికిత్స ఎలా పనిచేస్తుంది?
ఈఈసీపీ ప్రక్రియలో రోగి కాళ్లు, పిరుదుల భాగానికి ప్రత్యేకమైన కఫ్స్ను అమర్చి, వాటిని ఈసీజీ యంత్రానికి అనుసంధానిస్తారు. గుండె విశ్రాంతి తీసుకునే సమయంలో ఈ కఫ్స్ గాలితో నిండి, కాళ్ల నుంచి గుండెకు రక్త ప్రసరణను వేగవంతం చేస్తాయి. తిరిగి గుండె కొట్టుకునే సమయంలో ఆ గాలిని విడుదల చేయడం ద్వారా గుండెపై పని భారాన్ని తగ్గిస్తాయి. ఈ చికిత్సను ఏడు వారాల పాటు, వారానికి ఐదు రోజులు, రోజుకు ఒక గంట చొప్పున మొత్తం 35 సెషన్ల పాటు నిర్వహిస్తారు.
ఈ ప్రక్రియ వల్ల మూసుకుపోయిన ధమనుల చుట్టూ కొత్త రక్తనాళాలు అభివృద్ధి చెందుతాయని క్లీవ్ల్యాండ్ క్లినిక్ వంటి అంతర్జాతీయ వైద్య సంస్థలు వెల్లడించాయి. ఈ చికిత్స పొందిన సుమారు 30 నుంచి 50 శాతం మంది రోగులలో ఛాతీ నొప్పి తగ్గడంతో పాటు శారీరక శ్రమ చేసే సామర్థ్యం పెరిగినట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
అమెరికాలోని ఎఫ్డీఏ ఆమోదం పొందిన ఈ సురక్షితమైన చికిత్సను గర్భిణులు, తీవ్రమైన అధిక రక్తపోటు ఉన్నవారు మాత్రం వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది స్టెంట్లు లేదా బైపాస్ సర్జరీకి పూర్తి ప్రత్యామ్నాయం కానప్పటికీ, ఇతర చికిత్సా మార్గాలు లేని 'నో-ఆప్షన్' రోగులకు ఇది ఒక అద్భుతమైన పరిష్కారం.