వదంతులు నమ్మొద్దు, ప్రశాంతంగా ఉండండి: నీట్ రీఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులకు ఎన్టీయే సూచన

NTA advises NEET re-exam students to stay calm and ignore rumors
  • జూన్ 21న నీట్ యూజీ రీ-ఎగ్జామ్ యథాతథం
  • వదంతులు నమ్మొద్దు, ప్రశాంతంగా ఉండాలంటూ విద్యార్థులకు ఎన్టీఏ సూచన
  • పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడి
  • మానసిక ఒత్తిడికి గురైతే 'మానస్' హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని పిలుపు
నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్‌‌కు మరో మూడు రోజులే సమయం ఉన్న నేపథ్యంలో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది. జూన్ 21 (ఆదివారం) జరగనున్న ఈ పరీక్షకు ప్రశాంతంగా సిద్ధం కావాలని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని స్పష్టం చేసింది.

ఈ మేరకు ఎన్టీఏ 'ఎక్స్' వేదికగా విద్యార్థులకు భరోసానిస్తూ ఒక సందేశాన్ని పోస్ట్ చేసింది. "మీరు ఎంతో కష్టపడి సిద్ధమయ్యారు. ఇప్పుడు మీ శ్రమపై నమ్మకం ఉంచాల్సిన సమయం వచ్చింది. ఆందోళన చెందకుండా, తగినంత విశ్రాంతి తీసుకుని పరీక్షలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చండి" అని పేర్కొంది. 

మే 3న జరిగిన పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నీట్ యూజీ-2026 పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. ప్రతిభావంతులైన విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ పునరుద్ఘాటించింది.

పరీక్షల పారదర్శక నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అభ్యర్థులు అధికారిక సమాచారం కోసం ఎన్టీఏ వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.

పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థుల కోసం 'మానస్' (14416) మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని ఎన్టీఏ సూచించింది. "ఒత్తిడికి లోనవుతుంటే మీరు ఒంటరి వారని భావించకండి. సహాయం కోరడం బలహీనత కాదు, అది మీ బలానికి నిదర్శనం" అని పేర్కొంది. నిర్ధారణ లేని సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవద్దని తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఈ సందర్భంగా కోరింది.
Go Back to Shorts
NTA
NEET UG Re-exam
National Testing Agency
NEET Exam Guidelines
MANAS Helpline
Medical Entrance Exam

More Telugu News