ఏళ్ల తరబడి విధులకు డుమ్మా.. ఏపీలో 43 మంది డాక్టర్ల తొలగింపు
- ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వం కఠిన చర్యలు
- వైద్యుల బాధ్యతారాహిత్యాన్ని సహించబోమన్న మంత్రి సత్యకుమార్
- గత నెలలోనూ 51 మంది వైద్యులను తొలగించిన ప్రభుత్వం
- మరో 118 మంది వైద్యులు అనధికారికంగా గైర్హాజరైనట్లు గుర్తింపు
గత నాలుగేళ్లుగా ఈ 43 మంది వైద్యులు తమ విధులకు హాజరుకావడం లేదని ప్రభుత్వం గుర్తించింది. దీనిపై వారికి పలుమార్లు సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేసింది. వారిపై అభియోగాలు కూడా నమోదు చేసినప్పటికీ, వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారిని సర్వీసుల నుంచి శాశ్వతంగా తప్పించాలని నిర్ణయించినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు.
ఏపీ సివిల్ సర్వీసెస్ (కాండక్ట్) రూల్స్-1964 ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ఏడాదికి మించి అనధికారికంగా విధులకు దూరంగా ఉంటే, వారిని ఉద్యోగం నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ నిబంధనల ప్రకారమే ప్రస్తుతం ఈ 43 మందిపై వేటు వేసే ప్రక్రియను ఆరోగ్య శాఖ ప్రారంభించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని, విధులను విస్మరించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి హెచ్చరించారు.
ఇదే తరహాలో ప్రభుత్వం ఇటీవల కాలంలో తీసుకుంటున్న రెండో పెద్ద చర్య ఇది. గత నెలలో కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న 51 మందిని శాశ్వతంగా తొలగించారు. వీరిలో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు ఉన్నారు. తాజా చర్యలతో పాటు మరో 34 మంది వైద్యులపై అభియోగాలు నమోదు చేసి నోటీసులు ఇవ్వగా, వారు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో 15 మంది రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది.
ఇదిలా ఉంటే.. మరో ముగ్గురు ప్రొఫెసర్లపై కూడా త్వరలోనే కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్హెచ్) పరిధిలో సుమారు 118 మంది వైద్యులు అనధికారికంగా విధులకు దూరంగా ఉన్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. వారిపై కూడా దశలవారీగా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ వైద్య వ్యవస్థలో జవాబుదారీతనం పెంచడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.