యోగాంధ్ర-2026: రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది రిజిస్ట్రేషన్.. సీఎం సమీక్షలో కీలక ఆదేశాలు
- యోగాంధ్ర-2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
- ‘ఇంటింటా యోగా’ నినాదంతో కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశం
- జూన్ 21న జరిగే వేడుకలకు రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా రిజిస్ట్రేషన్లు
- విజయవాడలో జరిగే ప్రధాన కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం, యోగా గురు బాబా రామ్దేవ్
- ఈ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయింపు
యోగాను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువ చేసేందుకు ఏడాది కాలానికి సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారి కోసం ప్రత్యేకంగా 'థెరప్యూటిక్ యోగా' సెషన్లు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. 'యోగాంధ్ర-2026' కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే కోటి మందికి పైగా ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జూన్ 21న రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రస్థాయి ప్రధాన వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో సుమారు 5,000 నుండి 6,000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ వర్షం కురిస్తే ప్రత్యామ్నాయంగా అంబేద్కర్ కళావేదికలో వెయ్యి మందితో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు యోగా గురు బాబా రామ్దేవ్ కూడా పాల్గొననున్నారు. 'యోగాంధ్ర-2026' నిర్వహణ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 10 కోట్లు కేటాయించింది.
యోగా గురు బాబా రామ్దేవ్ జూన్ 19న రాష్ట్రానికి చేరుకోనున్నారు. జూన్ 20న ఉండవల్లిలో ముఖ్యమంత్రితో కలిసి ఆయన ప్రత్యేక యోగా సెషన్లో పాల్గొంటారు. వచ్చే ఏడాది యోగా దినోత్సవం సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన యోగా మాస్టర్ ట్రైనర్లకు ప్రత్యేక అవార్డులు అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే, 'యోగా యాజ్ డెస్టినేషన్' క్యాలెండర్ను కూడా జూన్ 21న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ చక్రధరబాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.