అన్నం వండే ముందు బియ్యం కడగడం మంచిదా? కాదా?
- అన్నం వండే ముందు బియ్యం కడగడంపై నిపుణుల విశ్లేషణ
- బియ్యం కడగడం వల్ల అదనపు పిండిపదార్థం, మైక్రోప్లాస్టిక్స్ తొలగిపోతాయి
- స్వల్పంగా పోషకాలు నష్టపోయే అవకాశం ఉందని వెల్లడి
- ఆర్సెనిక్ తగ్గాలంటే కడగడం కన్నా గంజి వార్చడమే ఉత్తమమని సూచన
ఆస్ట్రేలియాలోని అడిలైడ్ యూనివర్సిటీకి చెందిన ఆహార శాస్త్రవేత్తల ప్రకారం, బియ్యంపై ఉండే అదనపు పిండి పదార్థం (స్టార్చ్) కడగడం ద్వారా తొలగిపోతుంది. దీనివల్ల అన్నం అతుక్కోకుండా పొడిపొడిగా వస్తుంది. సాగు సమయంలో నీరు, నేల ద్వారా బియ్యానికి చేరే ఆర్సెనిక్ వంటి హానికారకాలు కూడా కొంతవరకు తొలగిపోతాయని ఆహార శాస్త్రవేత్త పర్మల్ డియో తెలిపారు. 2021లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, బియ్యాన్ని కడగడం వల్ల 20 నుంచి 40 శాతం వరకు మైక్రోప్లాస్టిక్స్ కూడా తగ్గుతాయని తేలింది.
అయితే, బియ్యాన్ని కడిగే క్రమంలో కాపర్, ఐరన్, జింక్ వంటి నీటిలో కరిగే కొన్ని పోషకాలను కూడా కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, సమతుల్య ఆహారం తీసుకునే వారికి ఈ నష్టం చాలా స్వల్పమని, దీనివల్ల ఆరోగ్యానికి పెద్దగా ఇబ్బంది ఉండదని డైటీషియన్ ఇవాంజెలిన్ మాంట్జియోరిస్ స్పష్టం చేశారు. ప్రస్తుత సూపర్ మార్కెట్లలో లభించే బియ్యం ఇప్పటికే శుద్ధి చేసి వస్తుండటంతో, కేవలం రుచి లేదా కాలుష్యాల తొలగింపు కోసమే కడగాల్సి ఉంటుందని మరో శాస్త్రవేత్త బో వాంగ్ వివరించారు.
నిపుణుల సలహా ప్రకారం, రుచి కోసం ఒకటి లేదా రెండు సార్లు బియ్యాన్ని సున్నితంగా కడగడం ఉత్తమం. దీనివల్ల పోషక నష్టం పెద్దగా జరగదు. ఆర్సెనిక్ వంటి హానికారకాల పట్ల ఆందోళన ఉన్నవారు, బియ్యాన్ని కడగడంతో పాటు ఎక్కువ నీటిలో ఉడికించి, గంజిని వార్చివేయడం మేలని శాస్త్రీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ పద్ధతి ద్వారా ఆర్సెనిక్ శాతాన్ని 40 నుంచి 60 శాతం వరకు తగ్గించవచ్చని తేలింది.