రోహిత్ శర్మ రనౌట్ హైడ్రామా.. గిల్ క్లారిటీతో ముగిసిన వివాదం!

Rohit Sharma run out drama controversy ends with Shubman Gill clarity
  • గిల్‌తో సమన్వయ లోపంతో రోహిత్ రనౌట్
  • అసహనం వ్యక్తంచేస్తూ మైదానం వీడిన సీనియర్ బ్యాటర్
  • మ్యాచ్ అనంతరం రనౌట్‌పై స్పష్టతనిచ్చిన గిల్
  • డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ రీప్లే చూశాడని వివరణ
ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించినప్పటికీ.. మైదానంలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌ మధ్య జరిగిన 'రనౌట్ హైడ్రామా' క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి మధ్య జరిగిన కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ రనౌట్ కావడం, అనంతరం అతడు అసంతృప్తితో మైదానాన్ని వీడటంపై సోషల్ మీడియాలో అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. అయితే, మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇచ్చిన క్లారిటీతో ఈ వివాదానికి తెరపడింది.

వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వయసులో బరిలోకి దిగిన భారత పురుష క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ (16 పరుగులు), ఇన్నింగ్స్ 6వ ఓవర్లో రనౌట్ అయ్యాడు. సింగిల్ తీసే క్రమంలో గిల్‌తో సమన్వయ లోపం కారణంగా  రనౌట్ అయి పెవిలియన్ చేరాడు. పరుగు కోసం రోహిత్ క్రీజు వదిలి చాలా దూరం వచ్చేసినా.. గిల్ మాత్రం బంతి వైపు చూస్తూ క్రీజులోనే ఉండిపోయాడు. దీంతో రోహిత్ వెనక్కి వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఔట్ అయిన వెంటనే రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహంతో గిల్‌ వైపు చూస్తూ అసహనం వ్యక్తం చేయడం స్టంప్ మైక్‌లో కూడా రికార్డయింది. దీంతో యువ కెప్టెన్ గిల్‌పై రోహిత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాగా, రోహిత్ శర్మ అవుట్ అయిన తీరు అభిమానులకు సరిగ్గా రెండేళ్ల క్రితం నాటి 'మొహాలీ సీన్'ను గుర్తుకు తెచ్చింది. 2024లో మొహాలీ వేదికగా అఫ్ఘనిస్థాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉండి.. ఇదే విధంగా శుభ్‌మన్ గిల్‌తో జరిగిన కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల డక్ అవుట్ (0) అయ్యాడు.  

ఈ హైడ్రామాపై మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ స్పందిస్తూ అసలు నిజాలను వెల్లడించాడు. "మైదానంలో అది కేవలం ఒక చిన్న కమ్యూనికేషన్ లోపం మాత్రమే. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన తర్వాత రోహిత్ భాయ్ స్వయంగా ఆ రనౌట్ రీప్లేను చూశాడు. ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందో ఆయనకు అర్ధమైంది. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు, అంతా సవ్యంగానే ఉంది" అని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా, గతంలో కూడా ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 మ్యాచ్ ఆడుతున్నప్పుడు కూడా రోహిత్ ఇలాగే రనౌట్ అయిన విషయాన్ని గిల్ గుర్తుచేస్తూ.. సీనియర్ ప్లేయర్‌గా రోహిత్‌కు ఆటలోని పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందన్నాడు. కెప్టెన్ ఇచ్చిన ఈ సూటి వివరణతో అభిమానుల మధ్య నడుస్తున్న రనౌట్ వివాదానికి పూర్తిగా ఫుల్‌స్టాప్ పడింది.
Go Back to Shorts
Rohit Sharma
Shubman Gill
India vs Afghanistan
Run out controversy
Cricket news
Team India

More Telugu News