యువతి కిడ్నాప్, అత్యాచారం.. లండన్లో భారత సంతతి వ్యక్తికి 34 ఏళ్ల జైలు శిక్ష
- థాయ్లాండ్ నుంచి సూట్కేస్ తెచ్చేందుకు నిరాకరించడంతో కిడ్నాప్
- ఒక రోజుకు పైగా నిర్బంధించి అత్యాచారం, చిత్రహింసలు
- ధైర్యంగా ముందుకొచ్చిన బాధితురాలు, ఆమె తల్లి
- నిందితుడు గగన్దీప్ సింగ్కు 18 ఏళ్ల తర్వాతే పెరోల్ అవకాశం
తీర్పు ప్రకారం గగన్దీప్ సింగ్ మొత్తం 34 ఏళ్ల శిక్ష అనుభవించాల్సి ఉండగా, అందులో 28 ఏళ్లు జైలులో గడపాలి. మరో 6 ఏళ్లు కఠినమైన లైసెన్స్ నిబంధనల కింద ఉండాలి. కనీసం 18 ఏళ్ల జైలు జీవితం పూర్తి చేసుకున్న తర్వాతే అతడు పెరోల్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత పొందుతాడు.
కేసు నేపథ్యం ఇదే..
2024 జూన్లో 24 ఏళ్ల బాధితురాలు థాయ్లాండ్ నుంచి యూకేకు తిరిగి వస్తున్నప్పుడు, గుర్తుతెలియని వస్తువులు ఉన్న ఓ సూట్కేస్ను తీసుకురావాలని కొందరు కోరారు. అనుమానం రావడంతో ఆమె అందుకు నిరాకరించింది. బర్మింగ్హామ్ ఎయిర్పోర్టులో దిగిన వెంటనే, ముసుగు ధరించిన వ్యక్తులు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించి లండన్కు తీసుకెళ్లారు. పశ్చిమ లండన్లోని హాన్వెల్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో ఆమెను నిర్బంధించి గగన్దీప్ సింగ్ రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఒక రోజుకు పైగా నిర్బంధంలో ఉంచి బాధితురాలిని నరకయాతనకు గురిచేశారు. ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపించి, బట్టలు విప్పి, కొరడాతో కొట్టి, సిగరెట్లతో కాల్చి తీవ్రంగా హింసించారు. అనంతరం ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించి విడిచిపెట్టారు.
తల్లి ధైర్యంతో వెలుగులోకి..
ఈ దారుణ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు మొదట పోలీసులను ఆశ్రయించడానికి వెనుకాడింది. అయితే, తన కుమార్తె పడిన వేదనను చూసిన ఆమె తల్లి ధైర్యం చెప్పింది. కిడ్నాప్ సమయంలో బాధితురాలు ధరించిన దుస్తులను, వైద్య నివేదికలను సాక్ష్యాలుగా భద్రపరిచి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా ఆ దుస్తులపై ఉన్న ఆధారాలతో పోలీసులు గగన్దీప్ సింగ్ను అరెస్ట్ చేశారు.
"ఈ కేసులో బాధితురాలు ఎదుర్కొన్న క్రూరత్వం ఊహకందనిది. ఆమె ప్రాణభయంతో గడిపింది. అయినప్పటికీ, ఆమె చూపిన ధైర్యానికి మేం అభినందిస్తున్నాం. ఆమె సహకారం వల్లే ఇంతటి ప్రమాదకరమైన వ్యక్తికి శిక్ష పడింది" అని ఈ కేసు దర్యాప్తు అధికారి, డిటెక్టివ్ కానిస్టేబుల్ సీతారా అబ్దుల్ తెలిపారు.
బాధితురాలు పోలీసుల ద్వారా విడుదల చేసిన ప్రకటనలో, "సిగ్గుపడాల్సింది మనం కాదు, నేరం చేసిన వాళ్లు. వేధింపులకు గురైన వారు ధైర్యంగా బతకాలి" అని పేర్కొంది. తన తల్లి వల్లే న్యాయం జరిగిందని, ఆమె ధైర్యం మరువలేనిదని తెలిపింది. ఈ ఘటన నేపథ్యంలో మహిళలు, బాలికలపై హింసను అరికట్టడానికి శిక్షణ, స్పందన విధానాలను మరింత బలోపేతం చేశామని మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు.