అలియా భట్పై ట్రోలింగ్ పై షాహిద్ కపూర్ స్పందన
- కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న తర్వాత అలియా భట్పై ట్రోలింగ్
- తాను ప్రత్యక్షంగా చూసిన విషయాలనే నమ్ముతానన్న షాహిద్
- నటీనటులకు నిజాయతీ చాలా ముఖ్యమని వ్యాఖ్య
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన షాహిద్, ప్రత్యేకంగా ఎవరి పేరును ప్రస్తావించకపోయినా, సోషల్ మీడియా కథనాలు, పరిశ్రమలోని వాస్తవ పరిస్థితులపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాను ప్రత్యక్షంగా చూసిన లేదా నిర్ధారించుకున్న విషయాలనే నమ్ముతానని, విన్న ప్రతి సమాచారాన్ని వెంటనే నిజమని భావించనని స్పష్టం చేశారు. ఏ అంశంపైనా పూర్తి అవగాహన లేకుండా నిర్ణయాలకు రావడం సరైంది కాదని పేర్కొన్నారు.
ప్రజల దృష్టిలో ఉండే వ్యక్తులు తమ గురించి ఇతరులు సృష్టించే అభిప్రాయాలకు పూర్తిగా లోనుకాకూడదని షాహిద్ సూచించారు. సోషల్ మీడియా యుగంలో ప్రచారం, ప్రతిచర్యలు చాలా వేగంగా మారుతున్నందున, నిజానిజాలు తెలుసుకోవడం మరింత ముఖ్యమైందన్నారు.
ఇక సెలబ్రిటీల ఇమేజ్ నిర్మాణంపై మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రేక్షకుల ఆలోచనా విధానం ఎంతో మారిందన్నారు. కృత్రిమంగా సృష్టించిన ఇమేజ్ల కంటే సహజత్వం, నిజాయతీని ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్నారని తెలిపారు. గతంలో పీఆర్ వ్యవస్థలు సెలబ్రిటీల ఇమేజ్ను నియంత్రించేవని... ఇప్పుడు ప్రేక్షకులు స్వతంత్రంగా అభిప్రాయాలు ఏర్పరుచుకుంటున్నారని చెప్పారు. అందుకే నటీనటులకు నిజాయతీ, పారదర్శకత గతంతో పోలిస్తే మరింత అవసరమని అభిప్రాయపడ్డారు.