సుప్రీం తీర్పు ఎదురుదెబ్బ కాదు: కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్
- రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్ పిటిషన్ కొట్టివేత
- ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
- దేశంలో ప్రజాస్వామ్యానికి ఏం జరుగుతుందో ఈ ఘటనతో వెల్లడైందని వ్యాఖ్య
ఈ పరిణామం తనను షాక్కు గురిచేయలేదని మీనాక్షి నటరాజన్ అన్నారు. ఎన్నికల కమిషన్ పనితీరుపై తమకు నమ్మకం లేదని, అయితే తమ న్యాయపరమైన వాదనలో ఎలాంటి బలహీనత లేదని ఆమె పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు వేసిన తన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎ.ఎస్. చందూర్కర్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. నామినేషన్ తిరస్కరణకు గురైన తర్వాత, ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. దీనిపై ఎన్నికల సంఘంలో పిటిషన్ ద్వారానే పరిష్కారం వెతుక్కోవాలని సూచించింది.
2022లో తెలంగాణలో నమోదైన ఒక క్రిమినల్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అఫిడవిట్లో వెల్లడించలేదని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో జూన్ 9న రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ను తిరస్కరించారు. అయితే, రెండేళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల వివరాలు మాత్రమే వెల్లడించాల్సి ఉంటుందని, ఈ కేసులో కేవలం సమన్లు మాత్రమే జారీ అయ్యాయని ఆమె తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు.