ఎద్దు స్థానంలో పొలం దున్నిన మహిళ.. స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం
- పిడుగుపాటుకు ఎద్దు చనిపోవడంతో కాడి మోసిన మహారాష్ట్ర మహిళ
- భర్తతో కలిసి పొలాన్ని దున్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్
- స్పందించిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్.. తక్షణ సాయం అందించాలని ఆదేశం
- బాధిత కుటుంబానికి కొత్త ఎద్దు, ఆర్థిక సహాయం అందించిన అధికారులు
లాతూర్ జిల్లాలోని దేవని తాలూకా బొంబాలి గ్రామానికి చెందిన కౌలు రైతు కాశీనాథ్ గైక్వాడ్కు రెండు ఎద్దులు ఉండగా, ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పిడుగు పడటంతో వాటిలో ఒకటి మరణించింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో, కొత్త ఎద్దును కొనుగోలు చేసే స్తోమత లేక ఆ దంపతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ క్రమంలో కాశీనాథ్ భార్య హౌసాబాయి గైక్వాడ్, మిగిలిన ఒక్క ఎద్దుతో కలిసి తానూ కాడి మోసింది. తమ ఎనిమిది ఎకరాల పొలాన్ని దున్నడానికి ఆమె సిద్ధమైంది.
ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నాయకులు స్పందించారు. ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్, శివసేన (యూబీటీ) ఎమ్మెల్సీ అంబదాస్ దాన్వే ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ సాయం కోరారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో బుధవారం లాతూర్ కలెక్టర్ భరత్ నేతృత్వంలో అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించి, గైక్వాడ్ కుటుంబానికి కొత్త ఎద్దును అందజేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సుమారు రూ.32,000 నష్టపరిహారాన్ని వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ప్రభుత్వ సాయం అందడంతో హౌసాబాయి ఊపిరి పీల్చుకుంది. "పొలం ఎలా దున్నాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు మా ఆందోళన తొలగింది" అని ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది.