దేశానికి శతాబ్దాల పునాది వేసిన మోదీ: బాబా రాందేవ్
- వచ్చే శతాబ్దాల కోసం దేశానికి మోదీ పునాది వేశారన్న రాందేవ్
- సుదీర్ఘకాలం ప్రధానిగా నెహ్రూ రికార్డును అధిగమించిన మోదీ
- మోదీ పాలనలో ప్రపంచవ్యాప్తంగా భారత్కు గౌరవం పెరిగిందని వ్యాఖ్య
- ఆత్మనిర్భర్, వికసిత్ భారత్ లక్ష్యాలను ప్రస్తావించిన యోగా గురు
నిన్న ఆయన ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ.. దేశ దీర్ఘకాలిక అభివృద్ధికి మోదీ పటిష్టమైన బాటలు వేశారని రాందేవ్ పేర్కొన్నారు. "ఆత్మనిర్భర్ భారత్" నిర్మాణం, 2047 నాటికి "వికసిత్ భారత్"గా మార్చాలన్న లక్ష్యాలు రాబోయే తరాలకు దిశానిర్దేశం చేస్తాయని వెల్లడించారు. మోదీ దార్శనికత కలిగిన నాయకుడని, ఆయన అనుసరిస్తున్న విధానాలు ప్రపంచ వేదికపై భారత్ గౌరవాన్ని ఇనుమడింపజేశాయని తెలిపారు.
"యోగా, ఆయుర్వేదం, స్వదేశీ తత్వం, సనాతన సంస్కృతికి మోదీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు గౌరవం పెరిగింది. ఒకప్పుడు భారత్ను చిన్నచూపు చూసేవారు, కానీ నేడు ఏ దేశానికి వెళ్లినా భారతీయులకు సమున్నత గౌరవం లభిస్తోంది" అని రాందేవ్ వివరించారు.
ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి కీలక నిర్ణయాలు దేశ ప్రతిష్టను మరింత పెంచాయని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ వ్యక్తిత్వాన్ని హిమాలయాలతో పోల్చిన రాందేవ్.. ఆయన దేశానికి చేసిన సేవలను జాతి శతాబ్దాల పాటు కృతజ్ఞతతో స్మరించుకుంటుందని అన్నారు.