పుట్టినరోజున బాలకృష్ణ కీలక ప్రకటన.. ఒకే వేదికపైకి తెలుగు సీఎంలు, కేంద్ర మంత్రులు

Nandamuri Balakrishna key announcement on birthday Telugu CMs and Union Ministers on one stage
  • జూన్ 22న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవాల ముగింపు సభ
  • హాజరుకానున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి
  • క్యాన్సర్ చిన్నారుల మధ్య పుట్టినరోజు జరుపుకొన్న ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ
  • హైదరాబాద్‌లో కొత్త బ్లాక్, అమరావతిలో నూతన ఆసుపత్రి నిర్మాణంపై ప్రకటన
  • ఆసుపత్రికి పలువురి నుంచి భారీగా విరాళాలు.. స్వీకరించిన బాలయ్య‌
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (BIACH&RI) 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న రజతోత్సవ వేడుకల ముగింపు సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు ఆసుపత్రి ఛైర్మన్, ప్రముఖ నటుడు శ్రీ నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. జూన్ 22వ తేదీన హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ నోవాటెల్ హోటల్‌లో జరిగే ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను ఆయన తెలియజేశారు.

ఈ ముగింపు వేడుకకు కేంద్ర ఆరోగ్య శాఖ‌మంత్రి జె.పి. నడ్డా, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతారని బాలకృష్ణ తెలిపారు. వీరితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశిష్ట అతిథులుగా పాల్గొంటారని పేర్కొన్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు.

సేవా పథంలో 25 ఏళ్లు.. భవిష్యత్‌పై కీలక ప్రకటనలు
2000వ సంవత్సరంలో తన తల్లిదండ్రులు స్వర్గీయ నందమూరి తారకరామారావు, శ్రీమతి బసవతారకం ఆశయాలకు అనుగుణంగా ఈ ఆసుపత్రిని ప్రారంభించామని బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. లాభాపేక్ష లేకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాన్సర్ రోగులకు సేవలందించడమే లక్ష్యంగా గత 25 ఏళ్లుగా సంస్థ పనిచేస్తోందన్నారు. గత సంవత్సర కాలంగా రజతోత్సవాల సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ వేడుకల ద్వారా గడిచిన కాలాన్ని సమీక్షించుకుంటూ, భవిష్యత్ కార్యాచరణను కూడా ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ఆసుపత్రి ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో "నార్త్ బ్లాక్" నిర్మాణం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని తుళ్లూరులో మరో నూతన ఆసుపత్రి నిర్మాణాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ 25 ఏళ్ల ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరినీ స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

చిన్నారుల మధ్య బాలయ్య‌ జన్మదిన వేడుకలు.. విరాళాల వెల్లువ
మీడియా సమావేశానికి ముందు, నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజును ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్యాన్సర్ బాధిత చిన్నారుల మధ్య జరుపుకున్నారు. సిబ్బంది ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను చిన్నారులతో కలిసి కట్ చేసి, వారికి పంచిపెట్టారు. అనంతరం వారికి ఆటబొమ్మలు, ఇతర బహుమతులు అందించి వారి ముఖాల్లో ఆనందం నింపారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి పలువురు ఉదారంగా విరాళాలు అందించారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీ సీతారామారాజు అందించిన లక్ష రూపాయల విరాళాన్ని బాలకృష్ణ స్వీకరించారు. త్రివేణి, కృష్ణవేణి పాఠశాలల విద్యార్థులు క్యాన్సర్ రోగుల సహాయార్థం సేకరించిన రూ. 1,01,116 విరాళాన్ని ఆయకు అందజేశారు. చిన్న వయసులోనే విద్యార్థులు చూపిన సేవాగుణాన్ని బాలకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. అమరావతిలో నిర్మించనున్న ఆసుపత్రి కోసం శ్రీ కాకర్ల రాఘవేంద్ర రావు అందించిన రూ. 10 లక్షల చెక్కును కూడా ఆయన స్వీకరించారు. దాతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో బాలకృష్ణతో పాటు ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి. సుబ్రహ్మణ్యేశ్వర రావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫణికోటేశ్వర రావు, అకడమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ కల్పనా రఘునాథ్, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Go Back to Shorts
Nandamuri Balakrishna
Basavatarakam Cancer Hospital
Chandrababu Naidu
Revanth Reddy
Silver Jubilee Celebrations
Amaravati Cancer Hospital

More Telugu News