రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu Naidu to visit West Godavari district tomorrow
  • రేపు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన
  • ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ
  • గడిచిన 6 నెలల్లో 26.46 లక్షల పాస్‌పుస్తకాలు అందజేసిన ప్రభుత్వం
  • భూ రికార్డుల భద్రతకు దేశంలోనే తొలిసారిగా బ్లాక్‌చైన్ టెక్నాలజీ వినియోగం
  • రైతులతో భేటీ అనంతరం పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించనున్న సీఎం
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (జూన్ 8) పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతం గ్రామంలో జరిగే ఈ సభలో రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను ముఖ్యమంత్రి స్వయంగా అందజేస్తారు. అనంతరం రైతులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుంటారు.

గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన పాస్‌పుస్తకాల్లోని తప్పులను సరిదిద్ది, పారదర్శకమైన రీతిలో కొత్త పాస్‌పుస్తకాలను అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రైతుల సమక్షంలోనే భూములను రీ-సర్వే చేసి, వారి ఆమోదం తర్వాతే తుది రికార్డులను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతీ నెలా ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా రైతులతో సమావేశమై, వారి సమక్షంలోనే అధికారులతో భూ వివరాలను చదివించి పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు.

6 నెలల్లో 26.46 లక్షల పాస్‌పుస్తకాల పంపిణీ

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, జనవరి నుంచి రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,688 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి కాగా, అందులో 6,459 గ్రామాలకు చెందిన 26.46 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను ప్రభుత్వం అందించింది. రానున్న 9 నెలల్లో మరో 10,357 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి చేసి, 67.32 లక్షల పాస్‌పుస్తకాలను పంపిణీ చేయాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించారు. 

దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్లాక్‌చైన్ ఆధారిత భూ రికార్డుల వ్యవస్థను అమలు చేస్తోంది. దీని ద్వారా ప్రతీ భూ యూనిట్‌కు ఒక శాశ్వత బ్లాక్‌చైన్ ఐడీ కేటాయిస్తున్నారు. తద్వారా రికార్డులను తారుమారు చేయడం అసాధ్యం. సర్వే నుంచి తుది రికార్డు వరకు ప్రతి దశలోనూ రైతు ఈ-కేవైసీని తప్పనిసరి చేశారు.

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు

సోమవారం ఉదయం 10:25 గంటలకు అమరావతి నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, 11 గంటలకు సిద్ధాంతం గ్రామానికి చేరుకుంటారు. 11:15 గంటలకు ‘మీ భూమి-మీ హక్కు’ ప్రజా వేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 గంటలకు రైతులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అనంతరం 3:15 గంటలకు టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలు ముగించుకుని సాయంత్రం 5:35 గంటలకు తిరిగి అమరావతికి చేరుకుంటారు.


Go Back to Shorts
Chandrababu Naidu
West Godavari
Mee Bhoomi Mee Hakku
Pattadar Passbooks
Land Records Re-survey
Andhra Pradesh Government

More Telugu News