పంత్‌ పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాలి.. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే సూచన

  • ఆఫ్ఘన్‌తో శనివారం ఏకైక టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం
  • వైస్ కెప్టెన్సీ తొలగింపుపై పంత్‌కు బాధలేదన్న అసిస్టెంట్‌ కోచ్‌
  • నాయకత్వానికి అధికారిక పదవులు అవసరం లేదని వ్యాఖ్య
  • సరైన నిర్ణయాలు తీసుకోవడంపైనే దృష్టి పెట్టాలని సూచన
టీమ్‌ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా తన బ్యాటింగ్ శైలిని మార్చుకోవాలని భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే సూచించాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో శనివారం ప్రారంభం కానున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. నాయకుడిగా ఎదగడానికి అధికారికంగా ఎలాంటి పదవులు అవసరం లేదని డష్కాటే అభిప్రాయపడ్డాడు. ఆటలో జట్టు పరిస్థితిని బట్టి సరైన నిర్ణయాలు తీసుకోవడంపైనే పంత్ దృష్టి పెట్టాలని సూచించాడు. గత నెలలో ఆఫ్ఘనిస్థాన్‌ టెస్టు కోసం జట్టును ప్రకటించిన సమయంలో పంత్‌ను బీసీసీఐ వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించిన విషయం తెలిసిందే.

ఈ నిర్ణయంపై స్పందించిన డష్కాటే.. వైస్ కెప్టెన్ పదవి నుంచి తీసేయడంపై పంత్‌కు ఎలాంటి ఫిర్యాదులు లేదా అభ్యంతరాలు లేవని స్పష్టం చేశాడు. అతడు ఈ మార్పును చాలా సానుకూలంగా తీసుకున్నట్లు చెప్పాడు. పంత్ ఇప్పటివరకు 49 టెస్టుల్లో 42.91 సగటుతో మొత్తం 3,476 పరుగులు చేశాడు. అతడి దూకుడుగా ఆడే శైలి భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించినప్పటికీ.. కొన్నిసార్లు అనవసరమైన షాట్లు ఆడి వికెట్ పారేసుకుంటారనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం 12.25 సగటుతో 49 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

వైస్ కెప్టెన్సీ కోల్పోయినప్పటికీ ఆఫ్ఘన్‌తో జరిగే టెస్టు మ్యాచ్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల భారత జట్టులో పంత్ కొనసాగుతున్నాడు. ఈ సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. పంత్‌తో పాటు యశస్వీ జైస్వాల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, నితీశ్‌ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.

Rishabh Pant
Ryan ten Doeschate
India vs Afghanistan
Test Cricket
Shubman Gill
India Test squad

More Telugu News