అమిత్‌ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మమతా బెనర్జీపై కేసు నమోదు!

  • హోం శాఖపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు
  • బంగ్లాదేశ్ నేత హాదీ హత్య వెనక కేంద్రం ఉందన్నారని ఫిర్యాదు
  • దేశ ప్రతిష్ఠ దెబ్బతీసేలా మాట్లాడారని పోలీసులకు న్యాయవాది ఫిర్యాదు
  • దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని ఆందోళన
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సిలిగురి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, హోం మంత్రి అమిత్ షాపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. జూన్ 2న కోల్‌కతాలో జరిగిన నిరసన సభలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ జాతీయుడు ఉస్మాన్ హాది హత్య గురించి ప్రస్తావించారు. ఆ హత్య వెనుక కేంద్ర హోం శాఖ ప్రమేయం ఉందనేలా ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై లాయర్ రింకీ సేన్ ఛటర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌లో ఉస్మాన్ హాది హత్య జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఆ హంతకులు మేఘాలయ సరిహద్దు దాటి బెంగాల్‌లోకి రాగా రాష్ట్ర ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. అయితే ఈ హత్య కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకే జరిగిందని మమతా బెనర్జీ ఆరోపించడం సరికాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

దీదీ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో ఉండే హిందువుల భద్రతను కూడా ఇవి ప్రమాదంలో పడేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రెచ్చగొట్టేలా మాట్లాడటం చట్టవిరుద్ధమని అన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Mamata Banerjee
FIR
West Bengal
Bangladesh
India

More Telugu News