కువైట్ ఎయిర్పోర్ట్పై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ క్షిపణి దాడి
- ఈ ఘటనలో ఒక భారత పౌరుడు మృతి, 63 మందికి తీవ్ర గాయాలు
- భారతీయుడి మరణాన్ని ధృవీకరించిన కువైట్లోని భారత రాయబార కార్యాలయం
- దాడి కారణంగా విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దు
విమానాశ్రయంలోని టెర్మినల్ 1 లక్ష్యంగా ఈ దాడి జరిగింది. దీనివల్ల భారీ ఆస్తి నష్టం సంభవించిందని, విమాన సర్వీసులన్నింటినీ నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఒక భారతీయ పౌరుడు మరణించిన విషయాన్ని కువైట్లోని భారత రాయబార కార్యాలయం 'ఎక్స్' వేదికగా ధృవీకరించింది. మృతుడి కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందించేందుకు కువైట్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు పేర్కొంది.
ఈ దాడిలో గాయపడిన వారిలో కొందరికి తలకు తీవ్ర గాయాలు కాగా, మరికొందరి అవయవాలు దెబ్బతిన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఏడుగురికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. సంఘటనా స్థలానికి 25 అంబులెన్సులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. తమ దేశంలోని పౌర, కీలక సదుపాయాలపై జరిగిన ఈ దాడిని కువైట్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.
అమెరికాకు సహకరిస్తున్నాయన్న కారణంతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఇటీవల ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే ఈ దాడి జరిగింది. గతంలోనూ కువైట్ విమానాశ్రయంపై దాడులు జరిగినా, ప్రాణనష్టం జరగడం ఇదే తొలిసారి. దాడి నేపథ్యంలో జూన్ 4 వరకు విమాన రాకపోకలను రద్దు చేశారు. దీంతో ఇండిగో సహా పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచనలు జారీ చేశాయి.