చంద్రబాబు, రేవంత్ రెడ్డి, పవన్ కల్యాణ్ లకు రామ్ చరణ్ కృతజ్ఞతలు
- రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న 'పెద్ది'
- టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు
- ఈ సినిమాపై ఇప్పటికే నెలకొన్న భారీ అంచనాలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం 'పెద్ది' రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ ఇరు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలకు రాంచరణ్ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు: "తెలుగు సినిమా పరిశ్రమకు నిరంతరం మద్దతు, ప్రోత్సాహం అందిస్తున్న గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అని రామ్ చరణ్ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు: "తెలుగు చిత్ర పరిశ్రమ అభ్యున్నతికి నిరంతరం తోడ్పాటునందిస్తున్న గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మరియు తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని చరణ్ రాసుకొచ్చారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటించింది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్కుమార్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.