నెహ్రూ రికార్డు బద్దలు.. సుదీర్ఘకాలం పాలించిన ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్ర!

PM Modi to become Indias longest serving elected PM
  • జూన్ 10 నాటికి  ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకోనున్న మోదీ
  • 4,398 రోజుల పాటు పాలించిన నేతగా ఇప్పటి వరకు నెహ్రూ పేరిట రికార్డు
  • 4,077 రోజులు అధికారంలో ఉన్న ఇందిరా గాంధీ
  • అత్యధిక కాలం అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధిగా ఇప్పటికే మోదీ పేరిట రికార్డు
భారత రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని అందుకోనున్నారు. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా పాలించిన ప్రధానిగా జూన్ 10న ఆయన సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల నాటి రికార్డును మోదీ అధిగమించనున్నారు. 2014 మే 26న తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ.. జూన్ 10 నాటికి వరుసగా 4,399 రోజుల పాలనను పూర్తి చేసుకోనున్నారు.

దేశంలో మొదటి సాధారణ ఎన్నికల తర్వాత 1952 మే 13న నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 1964 మే 27న మరణించే వరకు వరుసగా 4,398 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఇప్పుడు ఆ రికార్డును మోదీ దాటనున్నారు. అంతకుముందు 2025 జులై 25న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరిట ఉన్న 4,077 రోజుల నిరంతరాయ పాలన రికార్డును మోదీ దాటేశారు.

నెహ్రూ కాలంతో పోలిస్తే ప్రస్తుతం దేశ జనాభా, ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. తొలి సాధారణ ఎన్నికల సమయంలో దేశ జనాభా 34 కోట్లుగా ఉండగా ఓటర్లు 17 కోట్లు మాత్రమే. మోదీ ప్రధాని అయ్యే నాటికి జనాభా 131 కోట్లకు చేరి ప్రస్తుతం 146 కోట్లు దాటింది. అలాగే 1952 ఎన్నికల్లో కేవలం 53 పార్టీలు పోటీ చేయగా.. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి పోటీ చేసిన పార్టీల సంఖ్య ఏకంగా 744కు చేరింది.

నెహ్రూ తర్వాత వరుసగా మూడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ప్రధానిగా మోదీ నిలిచారు. కాంగ్రెసేతర ప్రధానిగా వరుసగా రెండుసార్లు పూర్తి మెజారిటీ సాధించిన రికార్డు కూడా ఆయనదే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా కలిపి అత్యధిక కాలం (8,930 రోజులకు పైగా) అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధిగా ఇప్పటికే మోదీ రికార్డు సృష్టించారు.
Go Back to Shorts
Modi
Jawaharlal Nehru
BJP
Congress
Prime Minister
Longest Serving PM

More Telugu News