ఆర్సీబీ గెలుపు సంబరాలు.. తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల వీరంగం
- ఐపీఎల్ లో ఆర్సీబీ గెలుపుతో తెలుగు రాష్ట్రాల్లో మితిమీరిన సంబరాలు
- కర్నూలులో ప్రైవేట్ బస్సుపై రాళ్లతో దాడి చేసిన అభిమానులు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ అంతరాయం
- రెండు నగరాల్లోనూ పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు
- ఘటనలపై కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీతో దర్యాప్తు
ఆదివారం రాత్రి కర్నూలులో వందలాది మంది ఆర్సీబీ అభిమానులు జెండాలు, బ్యానర్లతో రోడ్లపైకి వచ్చి హంగామా సృష్టించారు. దీంతో భారీగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పరిస్థితి అదుపు తప్పుతున్న క్రమంలో ఒక గుంపు, రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై రాళ్లతో దాడి చేసింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసం కాగా, లోపలున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, దాదాపు గంటపాటు శ్రమించి ఆందోళనకారులను చెదరగొట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇలాంటి ఘటనే హైదరాబాద్లోనూ చోటుచేసుకుంది. సచివాలయం, ట్యాంక్ బండ్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, డీఎల్ఎఫ్ గచ్చిబౌలి వంటి కీలక ప్రాంతాల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడి సంబరాలు జరుపుకున్నారు. కొన్నిచోట్ల పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేసి జనాలను చెదరగొట్టి, ట్రాఫిక్ను పునరుద్ధరించారు.