టీడీపీ ఆవిర్భావమే ఒక తిరుగులేని చరిత్ర: అనిత
- రికార్డులు సృష్టించడం టీడీపీకి కొత్త కాదన్న అనిత
- మహానాడు ద్వారా ప్రతి హృదయానికి పార్టీ చేరుతోందని వ్యాఖ్య
- చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచిందన్న అనిత
రికార్డులు సృష్టించడం తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని, ఆ పార్టీ ఆవిర్భావమే ఒక తిరుగులేని చరిత్ర, సంచలనమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న ఈ మహానాడు ద్వారా గ్రామ గ్రామానికి, ప్రతి కార్యకర్త హృదయానికి పార్టీ చేరుతోందని హర్షం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది మహానాడును ‘స్త్రీశక్తి’ థీమ్తో నిర్వహించడం మహిళల ఆత్మగౌరవం, సాధికారత, భద్రత పట్ల టీడీపీకి ఉన్న సంకల్పానికి నిదర్శనమని అనిత పేర్కొన్నారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే నారా లోకేశ్ 33 శాతం సీట్ల కేటాయింపుపై భారీ ప్రకటన చేశారని గుర్తుచేశారు.
ఇదే వేదికపై వైసీపీపై హోంమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "గతంలో ‘జై జగన్’ అనడానికి నిరాకరించి, ‘జై చంద్రబాబు.. జై తెలుగుదేశం’ అన్నందుకు బీసీ కార్యకర్త తోట చంద్రయ్యను గొడ్డలి పార్టీ రౌడీలు నడిరోడ్డుపై గొంతుకోసి చంపారు" అని మండిపడ్డారు. నాటి జగన్ ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్యాయం చేస్తే.. నేడు చంద్రబాబు ప్రభుత్వం వారికి అండగా నిలిచిందని, మహానాడు పండుగ వేళ చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగిగా నియమితులయ్యారని అనిత వెల్లడించారు.