తెలుగు రాష్ట్రాల్లో గాలివాన బీభత్సం... ముగ్గురి మృతి

  • ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్న పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం
  • ఏపీలోని అనకాపల్లి, కాకినాడ, తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాల్లో గాలితో కూడిన వర్షం
  • సత్యవరంలో కొబ్బరిచెట్లు నేలకూలి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కూలీలు
గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే శనివారం తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ గాలివాన బీభత్సం సృష్టించింది. ఏపీలోని అనకాపల్లి, కాకినాడ, తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాల్లో గాలితో కూడిన వర్షం అల్లకల్లోలం సృష్టించింది. గాలివాన బీభత్సం కారణంగా ఏపీలో ఇద్దరు, తెలంగాణలో ఒకరు మృత్యువాత పడ్డారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

అనకాపల్లి జిల్లా నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో దాదాపు అరగంట పాటు గాలి, వాన రావడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రమణయ్యపేట, ముకుందరాజుపేట, దోసలపాడు, చీడిక, జి.జగన్నాథపురం, గొడిచర్ల, డొంకాడ, చినదొడ్డిగల్లు, కాగిత జాతీయ. రహదారి వంటి గ్రామాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి.

సత్యవరం గ్రామంలో కొబ్బరిచెట్లు నేలకూలి తమలపాకులు సేకరించే ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ముకుందరాజుపేటలో ఇంటి రేకులు పడి ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. గాలుల ప్రభావంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. మామిడి, అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో భారీ ఈదురుగాలులకు తలుపులమ్మ తల్లి లోవ ఆలయ మార్గంలో కారుపై చెట్లు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు.

మరోవైపు, తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం గోవిందాయిపల్లిలో పిడుగుపాటుకు ఒక గొర్రెల కాపరి మృతి చెందాడు. అచ్చంపేటలో భారీ వర్షం కారణంగా ధాన్యం తడిసిపోయింది.

Anakapalli
Andhra Pradesh
heavy rain
thunderstorm
Nagar Kurnool
weather
casualties
heatwave

More Telugu News