మండుతున్న ఎండలు.. రేవంత్ కీలక సూచనలు
- తెలంగాణలో రోజురోజుకూ ముదురుతున్న ఎండలు
- అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్న సీఎం
- వడదెబ్బకు గురైన వారికి తక్షణ వైద్యం అందించేలా వైద్య సిబ్బంది అలర్ట్గా ఉండాలని ఆదేశం
తెలంగాణలో రోజురోజుకూ ముదురుతున్న ఎండల తీవ్రత, వడగాడ్పులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్న వాతావరణ శాఖ (IMD) హెచ్చరికల నేపథ్యంలో సీఎం స్పందించారు. జిల్లాల్లో మారుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, జిల్లా కలెక్టర్లకు తగిన దిశానిర్దేశం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఎండల తీవ్రతను తట్టుకునేందుకు వీలుగా ప్రజల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి జిల్లా ఆసుపత్రుల వరకు ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లను భారీగా అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు. వేసవి దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. వడదెబ్బకు గురైన బాధితులకు ఆసుపత్రుల్లో తక్షణమే మెరుగైన వైద్యం అందించేలా సిబ్బంది అలర్ట్గా ఉండాలని ఆదేశిస్తూనే, పట్టణ ప్రాంతాల్లో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలు సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం వేళల్లో ప్రయాణాలు చేయకుండా సురక్షితంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.