దేశం భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని చూడబోతోంది.. మోదీ విధానాలపై రాహుల్‌ గాంధీ ఫైర్‌

Rahul Gandhi Warns of Severe Economic Crisis Under Modis Policies
  • మోదీ విదేశీ పర్యటనలపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ
  • దేశంపై పెద్ద ఆర్థిక తుపాను విరుచుకుపడుతుందని హెచ్చరిక
  • ఆర్థిక సంక్షోభం సామాన్యులనే దెబ్బతీస్తుందని వ్యాఖ్య
  • అదానీ, అంబానీలు, మోదీ ప్యాలెస్‌లో సురక్షితంగా ఉంటారని విమర్శ
దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో పర్యటిస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో పర్యటించిన ఆయన చురువా హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశంలో సంక్షోభ పరిస్థితులు ఉన్నాయని.. ప్రజలను బయటకు వెళ్లొద్దని ప్రధాని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయనేమో ప్రపంచమంతా చుట్టేస్తున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు.

ముందుముందు దేశంపై ఒక పెద్ద ఆర్థిక తుపాను విరుచుకుపడబోతోందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ‘‘రాబోయే ఆర్థిక సంక్షోభం అదానీ, అంబానీ, మోదీని ఏమీ చేయలేదు. వాళ్లంతా తమ ప్యాలెస్‌లలో భద్రంగా ఉంటారు. కానీ దేశ యువత, సామాన్య ప్రజలు దీనివల్ల తీవ్రంగా దెబ్బతింటారు. ఇంతకుముందెన్నడూ చూడని భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని దేశం చూడబోతోంది. కష్టకాలం ముందుంది. మోదీ ఆర్థిక విధానాలే ఇందుకు కారణం’’ అని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ప్రధాని మోదీ ఐదు దేశాల దౌత్య పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి ఇటలీ చేరుకోనున్నారు. అంతకుముందే ఆయన యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే దేశాల పర్యటనలను పూర్తి చేసుకున్నారు. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దేశం రానున్న రోజుల్లో తీవ్ర సంక్షోభం ఎదుర్కోనుందని మోదీ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు పొదుపు చర్యలు పాటించాలని సూచించారు. బంగారం కొనొద్దని, ప్రజా రవాణాను వినియోగించుకోవాలని, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విదేశీ పర్యటనలను వాయిదా వేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే రాహుల్‌ తాజాగా ఆయన్ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు.
Go Back to Shorts
Rahul Gandhi
Narendra Modi
economic crisis India
Indian economy
economic recession
India recession 2024
Adani Ambani
employment India
Indian youth
Ray Bareli

More Telugu News