రాజస్థాన్ రాయల్స్ పై టాస్ గెలిచిన ఢిల్లీ... ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్న శ్రీకాకుళం కుర్రాడు

  • రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
  • ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం
  • ఢిల్లీ తరఫున త్రిపురాన విజయ్ అరంగేట్రం
  • రాజస్థాన్ జట్టులోకి రవి సింగ్.. రవీంద్ర జడేజాకు విశ్రాంతి
  • గాయం నుంచి కోలుకుని ఆర్ఆర్ కెప్టెన్‌గా తిరిగొచ్చిన రియాన్ పరాగ్
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌ తో కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ పోరుకు వేదికైంది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం ఇరు జట్లకు తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఇరు జట్లు మార్పులతో బరిలోకి దిగాయి.

టాస్ గెలిచిన అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ, తమ సొంత మైదానంలో ఇదే చివరి మ్యాచ్ అని, జట్టులో ఒక మార్పు చేసినట్లు తెలిపాడు. యువ ఆల్ రౌండర్ త్రిపురాన విజయ్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నాడని, అకిబ్ నబీ స్థానంలో అతడు తుది జట్టులోకి వచ్చాడని చెప్పాడు.

ఎవరీ త్రిపురాన విజయ్?
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ క్రికెటర్ త్రిపురాన విజయ్ దేశవాళీ క్రికెట్‌లో తన ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ఈ 24 ఏళ్ల ఆటగాడు, కుడిచేతి వాటం ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా రాణిస్తున్నాడు. దేశవాళీ టోర్నీలలో ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సభ్యుడిగా చోటు దక్కించుకున్నాడు. బ్యాటింగ్ కూడా చేయగల విజయ్, బౌలింగ్‌లో తనదైన శైలిలో రాణిస్తూ సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

విజయ్ తన బౌలింగ్‌తో ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 52 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన ఘనత కూడా ఉంది. ఇటీవల నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల ప్రదర్శనతో పాటు 58 పరుగులు చేసి ఆల్ రౌండ్ సత్తా చాటాడు. లిస్ట్ ఏ, టీ20 ఫార్మాట్లలోనూ ఆంధ్రా తరఫున ఆడుతున్న ఈ యువ ప్రతిభ, భవిష్యత్తులో కీలక ఆటగాడిగా ఎదిగే అవకాశాలున్నాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

జట్టులోకి వచ్చిన రియాన్ పరాగ్
మరోవైపు, తొడ కండరాల గాయం నుంచి కోలుకుని రాజస్థాన్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. టాస్ సమయంలో పరాగ్ మాట్లాడుతూ, పని భారం కారణంగా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు విశ్రాంతినిచ్చామని తెలిపాడు. అతని స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రవి సింగ్ అరంగేట్రం చేస్తున్నాడని ప్రకటించాడు. అదే సమయంలో ఆడమ్ మిల్నే కూడా జట్టులోకి వచ్చాడని వివరించాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా తాము నిర్దేశించిన స్కోర్లను కాపాడుకోలేకపోతున్నామని, అందుకే ఈసారి అదనపు సీమర్‌తో ఆడుతున్నామని పరాగ్ పేర్కొన్నాడు.

Tripurana Vijay
Delhi Capitals
Rajasthan Royals
IPL 2024
Indian Premier League
Srikaulam
Andhra Pradesh Cricket
Riyan Parag
Arun Jaitley Stadium
Cricket

More Telugu News