విచారణలో బండి భగీరథ్ తన నేరాన్ని అంగీకరించాడు: సైబరాబాద్ సీపీ

  • బండి భగీరథ్‌ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు 
  • బాలికపై లైంగికదాడి ఆరోపణలతో పోక్సో చట్టం కింద కేసు 
  • విచారణలో నేరం అంగీకరించాడని వెల్లడించిన పోలీసులు
  • 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ విచారణలో తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. 
ఈ ఘటనపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం.రమేశ్ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక ప్రకటన విడుదల చేశారు. బాధితురాలైన బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 8న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో భగీరథ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం, ఇతర సాక్షులను విచారించిన తర్వాత, ఈ కేసుకు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 64 (2) (m) తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 5 (1), 6లను జోడించినట్లు వివరించారు.

కేసు దర్యాప్తును పర్యవేక్షించేందుకు కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌ను నియమించారు. నిందితుడిని పట్టుకోవడం కోసం కరీంనగర్, ఢిల్లీతో పాటు అతడు తరచూ వెళ్లే ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. అంతేకాకుండా, దర్యాప్తు అధికారి (IO) లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) కూడా జారీ చేశారు.

ఈ క్రమంలో, మంచాలలోని టెక్ పార్క్ సమీపంలో నిందితుడు ఉన్నాడన్న కచ్చితమైన సమాచారంతో పోలీసులు నాకాబందీ నిర్వహించారు. మే 16న రాత్రి 8:15 గంటల సమయంలో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) భగీరథ్‌ను అదుపులోకి తీసుకుని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించింది. అక్కడ ‘పంచ సాక్షుల’ సమక్షంలో విచారించగా భగీరథ్ నేరం చేసినట్లు అంగీకరించాడని కమిషనర్ తన ప్రకటనలో పేర్కొన్నారు. వైద్య పరీక్షల అనంతరం అతడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా కోర్టు అతడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

Bandi Bhagirath
Bandi Sanjay
POCSO Act
Cyberabad Police
Sexual Assault
Minor Girl
Telangana News
Crime News
Judicial Remand
Patebasheerabad Police Station

More Telugu News