రాయలసీమ ఇకపై ‘రక్షణ సీమ’... ఏఎంసీఏ ప్రాజెక్టుతో ఏపీలో నవ శకం
- రాయలసీమను డి హబ్గా మార్చే దిశగా ప్రభుత్వ భారీ అడుగులు
- పుట్టపర్తిలో రూ.15,803 కోట్లతో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన
- రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి భూమిపూజ చేయనున్న సీఎం చంద్రబాబు
- డ్రోన్, డిఫెన్స్ రంగాల్లో మరో 12 కంపెనీల ప్రాజెక్టులకు శ్రీకారం
- వేల కోట్ల పెట్టుబడులతో పాటు వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు
పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు భూమిపూజ
దేశ రక్షణ వ్యవస్థలో గేమ్ ఛేంజర్గా భావిస్తున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు పుట్టపర్తిలో పునాది రాయి పడనుంది. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ), డీఆర్డీఓ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. సుమారు రూ.15,803 కోట్ల భారీ బడ్జెట్తో, 650 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఈ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా, భారతదేశపు మొట్టమొదటి 5వ తరం స్టెల్త్ మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లను అభివృద్ధి చేస్తారు. స్టెల్త్ టెక్నాలజీ, ట్విన్ ఇంజిన్, సూపర్ క్రూయిజ్ వంటి అత్యాధునిక సామర్థ్యాలు ఈ యుద్ధ విమానాల ప్రత్యేకత. కేవలం తయారీనే కాకుండా, వాటి టెస్టింగ్ కూడా పుట్టపర్తిలోనే చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 7,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. దీనికి అనుబంధంగా వచ్చే ఇతర పరిశ్రమల ద్వారా మరో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉందని, దీనికోసం ప్రభుత్వం మరో 400 ఎకరాలు కేటాయించింది.