ఏపీ ఆర్ధిక వ్యవస్థకు కొత్త రూపు.. ఇకపై నెల నెలా డేటా సేకరణ

Chandrababu Naidu Focuses on AP Economic Growth with Monthly Data Collection
  • ఆర్ధిక వ్యవస్థ పటిష్టతే లక్ష్యం
  • సామర్ధ్యం పెంపుపై సీఎం చంద్రబాబు దృష్టి
  • పటిష్ట ఆర్ధిక వ్యవస్థకు సామర్ధ్యం పెంపే మార్గం
  • రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై ప్రతీ నెలా గణాంకాల సేకరణ
  • రాష్ట్రం నుంచి మండల స్థాయి వరకు ఉద్యోగులకు శిక్షణ
  • ఆర్ధిక విశ్లేషణకు ఏఐ టెక్నాలజీ వినియోగం
  • 15 శాతం వృద్ధి సాధించి స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధన
రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు వ్యవస్థల సామర్ధ్యాన్ని పెంచడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 15 శాతం వృద్ధిరేటును స్థిరంగా సాధించడం ద్వారానే స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని చేరుకోగలమని, దీనికోసం క్షేత్రస్థాయి నుంచి పక్కాగా, వేగంగా గణాంకాలు సేకరించాలని సూచించారు. బుధవారం నాడు సచివాలయంలో ప్రణాళిక శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే పూర్తిస్థాయి 'డేటా డ్రివెన్ గవర్నెన్స్‌'కు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప్రస్తుతం త్రైమాసిక, వార్షిక ప్రాతిపదికన రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) అంచనాలు రూపొందిస్తున్నారని, దీనివల్ల వాస్తవ ఆర్ధిక పరిస్థితిపై తక్షణ అవగాహన కలగడం లేదని సీఎం అభిప్రాయపడ్డారు. చారిత్రక డేటాపై ఆధారపడటం వల్ల విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందన్నారు. ఈ విధానాన్ని మార్చి, ప్రతీ నెలా రాష్ట్ర ఆర్ధిక వృద్ధిని జిల్లా, మండల స్థాయిలో ట్రాక్ చేసేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. ఇందుకోసం జీఎస్‌డీపీ విధానాన్ని అర్థం చేసుకునేలా, రియల్‌టైమ్ పద్ధతిలో అంచనాలు రూపొందించేలా అధికారులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.

రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు సిబ్బందికి మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని 5 జోన్లు, 28 జిల్లాలు, 175 నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ శిక్షణ ఉండాలన్నారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు అధికారులను మాస్టర్ ట్రైనర్లుగా తీర్చిదిద్దాలని సూచించారు. 

మరోవైపు, వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో ఏఐ ఆధారిత ఆర్ధిక విశ్లేషణ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం పర్యవేక్షణలో లేని ఆర్ధిక సూచికలను కూడా గుర్తించి, వాటిని కూడా ట్రాక్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. సమీక్షలో జీఎస్‌డీపీ సామర్ధ్య పెంపు, రాబోయే సర్వేలు, కేపీఐల ఆడిటింగ్ వంటి పలు కీలక అంశాలపై చర్చించారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
AP Economy
GSDP
Data Driven Governance
Economic Growth
AP Development
Real Time Data
Data Collection
Swarnandhra 2047

More Telugu News