సువేందు అధికారి పీఏ హత్య కేసు.. నిందితులకు 13 రోజుల పోలీస్ కస్టడీ
- చంద్రనాథ్ హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
- 13 రోజుల పోలీస్ కస్టడీ విధించిన బారాసాత్ కోర్టు
- ముఠా నాయకుడు శ్రీవాస్తవపై గతంలోనే 15కి పైగా హత్య, దోపిడీ కేసులు
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ హత్య కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులను పోలీసులు బారాసాత్ కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం వారికి 13 రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
గత బుధవారం రాత్రి తన ఇంటికి అతి సమీపంలో చంద్రనాథ్ రథ్ దారుణంగా హత్యకు గురయ్యారు. దుండగులు పక్కా ప్లాన్తో నిస్సాన్ మైక్రా కారుతో ఆయన వాహనాన్ని అడ్డగించారు. వెంటనే ఇతర హంతకులు బైక్ పై వచ్చి, అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ముఠా నాయకుడు విశాల్ శ్రీవాస్తవపై గతంలోనే 15కి పైగా హత్య, దోపిడీ కేసులు ఉన్నాయి. హత్య తర్వాత నిందితులు వాడిన కారును అక్కడే వదిలేసి, మరో వాహనంలో పారిపోయారు.
పోలీస్ కస్టడీలో నిందితుల నుంచి అసలు విషయాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ హత్య వెనుక కేవలం పాత కక్షలు ఉన్నాయా లేదా ముఖ్యమంత్రికి సన్నిహితుడు కావడంతో రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై దర్యాప్తు ముమ్మరం చేశారు.