హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ... బేగంపేట ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం

Narendra Modi Arrives in Hyderabad Receives Grand Welcome
  • తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన 
  • స్వాగతం పలికిన గవర్నర్, డిప్యూటీ సీఎం భట్టి
  • రూ.9,377 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
  • సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ
  • మూడోసారి ప్రధాని అయ్యాక రాష్ట్రానికి తొలిసారి రాక
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో దిగిన ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీజేపీ నేతలు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని రోడ్డు మార్గంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)కి బయలుదేరారు.

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మొత్తం రూ.9,377 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిని ఆయన జాతికి అంకితం చేస్తారు. కార్యక్రమాల అనంతరం సాయంత్రం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక ప్రధాని మోదీ రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి, పటిష్ఠమైన నిఘా కొనసాగిస్తున్నారు.

బహిరంగ సభ ముగిశాక మోదీ తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల నివాసాలకు కూడా వెళ్లి వారిని కలవనున్నారు. కాగా, పవన్ నివాసంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది.
Go Back to Shorts
Narendra Modi
Telangana
Hyderabad
PM Modi Hyderabad Visit
Begumpet Airport
BJP
Chandrababu Naidu
Pawan Kalyan
Chiranjeevi
Telangana Development Projects

More Telugu News