సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
- జహీరాబాద్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం
- ఆగి ఉన్న ట్రాలీ ఆటోను ఢీకొట్టిన కారు
- ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి, మరో ముగ్గురికి గాయాలు
- తుల్జాపూర్ నుంచి వస్తుండగా ప్రమాదానికి గురైన చేవెళ్ల వాసులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన కొందరు మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తుల్జాపూర్ భవానీ అమ్మవారిని దర్శించుకుని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు జహీరాబాద్ బైపాస్ వద్దకు రాగానే అదుపుతప్పి, రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రాలీ ఆటోను వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ముగ్గురిని చికిత్స కోసం జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులను చేవెళ్ల ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పుణ్యక్షేత్రం నుంచి సంతోషంగా తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.