ఆ వాహనాలకు భవిష్యత్తు లేదు: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

  • శిలాజ ఇంధన ఆధారిత రవాణా నుంచి బయటకు రావాలన్న గడ్కరీ
  • సీఎన్జీ, ఎలక్ట్రిక్ తదితర వాహనాల వైపు మళ్లాలని సూచన
  • ప్రజలు చౌక వాహనం కంటే సురక్షిత వాహనానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న గడ్కరీ
డీజిల్, పెట్రోల్ వాహనాలకు భవిష్యత్తు లేదని, శిలాజ ఇంధన ఆధారిత రవాణా నుంచి త్వరగా బయటపడాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మంగళవారం జరిగిన బస్ వరల్డ్ ఇండియా 2026 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మన దేశంలో ప్రజారవాణా వ్యవస్థలో శిలాజ ఇంధనాలకు భవిష్యత్తు లేదని అన్నారు. హైడ్రోజన్, ఇథనాల్, సీఎన్జీ, ఎల్ఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మారాలని సూచించారు.

భౌగోళిక రాజకీయ అస్థిరతల కారణంగా చమురు సరఫరా గొలుసులో ఆందోళనలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో, ప్రత్యామ్నాయం చూడాలనే చర్చ సాగుతోంది. ఇలాంటి తరుణంలో గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. బయోఫ్యూయల్ వంటి స్వదేశీ, స్వచ్ఛమైన ఇంధనాల వైపు మళ్లడం తప్పనిసరి అన్నారు. రవాణా రంగం తక్కువ ఖర్చుతో కూడిన, కాలుష్యరహిత, స్వదేశీ పరిష్కారాలపై దృష్టి సారించాలని సూచించారు.

ఖర్చు తగ్గించుకోవడానికి భద్రత, నాణ్యత విషయాల్లో రాజీపడకూడదని బస్సుల తయారీదారులను ఉద్దేశించి సూచించారు. ప్రజలు ఇప్పుడు చౌక వాహనం కంటే సురక్షితమైన, మెరుగైన వాహనానికే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. దేశంలో బస్సుల తయారీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వెయ్యి మంది కోసం ఎనిమిది బస్సులు ఉంటే, మన దేశంలో కేవలం రెండు ఉన్నాయని అన్నారు. రాబోయే మూడేళ్లలో ఎలక్ట్రిక్ బస్సుల అవసరం 1.5 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.

No Future for Petrol and Diesel Vehicles
Nitin Gadkari

More Telugu News