కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అని శశి థరూర్ అంగీకరించారు: కిరన్ రిజిజు
- పార్లమెంట్ సమావేశాల తర్వాత థరూర్ తనతో మాట్లాడారన్న కిరణ్ రిజిజు
- మహిళా రిజర్వేషన్లను విపక్షాలు అడ్డుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్య
- బిల్లును విపక్షాలు అడ్డుకుంటాయని కలలో కూడా ఊహించలేదన్న రిజిజు
మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో వీగిపోవడంతో జాతీయ రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంటు సమావేశాల తర్వాత శశి థరూర్ తనతో మాట్లాడుతూ.. "కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి కావచ్చు, కానీ నన్ను ఎవరూ అలా అనలేరు" అన్నట్లు రిజిజు వెల్లడించారు. ఇది పరోక్షంగా కాంగ్రెస్ తీరును థరూర్ తప్పుబట్టడమేనని రిజిజు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ వంటి పార్టీలు మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడం దురదృష్టకరమని, దీనికి ఆయా పార్టీలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రిజిజు హెచ్చరించారు.
బిల్లు నెగ్గదని బీజేపీకి ముందే తెలుసన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. మహిళలకు మేలు చేసే బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తాయని కలలో కూడా ఊహించలేదని చెప్పారు. మోదీని టార్గెట్ చేస్తే నాయకుల భవిష్యత్తు పతనం అవుతుందని హెచ్చరించారు. ఆమ్ ఆద్మీ పార్టీని కేజ్రీవాల్ తన సొంత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మార్చేశారని రిజిజు విమర్శించారు. రాబోయే అసోం ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.