స్పేస్ సిటీపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన.. ఆస్ట్రోబేస్ కంపెనీ ప్లాంట్ ఏర్పాటు

  • ఏపీలో స్పేస్ సిటీ ఏర్పాటు కల సాకారం అవుతోందన్న మంత్రి నారా లోకేశ్
  • తిరుపతి జిల్లాలో స్పేస్ సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడి
  • దేశంలోనే తొలి ప్రైవేట్ క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తున్న ఆస్ట్రోబేస్ కంపెనీ
  • శ్రీహరికోట, తిరుపతి విమానాశ్రయానికి సమీపంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘స్పేస్ సిటీ’ కల సాకారం అవుతోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులు వేగంగా పురోగమిస్తున్నాయని, తమ ప్రభుత్వ దార్శనికత ఇప్పుడు రూపుదిద్దుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా 'ఎక్స్'  వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

"మేం స్పేస్ సిటీ నిర్మిస్తామన్నప్పుడు చాలామందికి సందేహాలు కలిగాయి. కానీ ఈ రోజు ఆ కల రూపుదిద్దుకుంటోంది. ఏపీలోనే ఆస్ట్రోబేస్ కంపెనీ, దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు రంగంలో 200 టన్నుల థ్రస్ట్ క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తోంది. అత్యాధునిక ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ చిరునామాగా మారింది. భవిష్యత్తు ఉత్సాహంగా ఉంది," అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.

తిరుపతి జిల్లా, తొట్టంబేడు మండలంలోని రౌతుసురమాల గ్రామం వద్ద సుమారు 2,600 ఎకరాల్లో ఈ స్పేస్ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రదేశం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌కు (షార్) 60 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి విమానాశ్రయానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండటం వ్యూహాత్మకంగా ఎంతో కీలకం.
 
 

Nara Lokesh
Andhra Pradesh
Space City
Astrobase
Cryogenic Engine
Tottambedu
Sriharikota
Satish Dhawan Space Centre

More Telugu News