గ్యాంగ్‌స్టర్‌ నయీం మాజీ అనుచరుడి హత్యకు కుట్ర.. త్రుటిలో తప్పించుకున్న పాశం శ్రీనివాస్

  • మరో మాజీ అనుచరుడు ఖాజా కత్తులతో దాడికి విఫలయత్నం
  • హోటల్‌లో అనుమానంగా కనిపించడంతో భగ్నమైన కుట్ర
  • ఆర్థిక వివాదాలే కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు?
గ్యాంగ్‌స్టర్‌ నయీం మాజీ ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్‌ (53) హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. అతడిపై దాడి చేసేందుకు మరో మాజీ అనుచరుడు ఎండీ ఖాజా చేసిన కుట్రను శ్రీనివాస్ సోదరుడు భగ్నం చేశాడు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధికా క్రాస్‌రోడ్స్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం, భువనగిరికి చెందిన పాశం శ్రీనివాస్ గతంలో నయీంకు కీలక అనుచరుడిగా ఉండేవాడు. ప్రస్తుతం సఫిల్‌గూడలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం రాధికా క్రాస్‌రోడ్డులోని ఓ హోటల్‌లో తన న్యాయవాదులు, సోదరుడు స్వామితో కలిసి శ్రీనివాస్ సమావేశమయ్యాడు. అదే సమయంలో నయీం మరో అనుచరుడైన ఖాజా చేతిలో సంచితో అక్కడికి వచ్చాడు.

అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన శ్రీనివాస్ సోదరుడు స్వామి ఖాజా చేతిలోని బ్యాగును తనిఖీ చేయగా అందులో రెండు పెద్ద కత్తులు బయటపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన స్వామి అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఖాజా అక్కడి నుంచి పరారయ్యాడు. 

ఖాజా గతంలో తన వద్ద పలుమార్లు డబ్బులు తీసుకున్నాడని, ఇటీవల ఇవ్వడానికి నిరాకరించడంతోనే తనపై కక్ష పెంచుకొని హత్యకు కుట్ర చేసి ఉండవచ్చని శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. శ్రీనివాస్, ఖాజా ఇద్దరూ నయీం అనుచరులుగా పలు కేసుల్లో నిందితులుగా ఉండి, జైలు శిక్ష కూడా అనుభవించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఘటనా స్థలంలో కత్తుల బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.

Pasham Srinivas
Nayeem
Gangster Nayeem
MD Khaja
Kushaiguda
Attempted Murder
Radhika Crossroad
Hyderabad Crime
Telangana Police

More Telugu News