ప్రేమ వివాహం వివాదం.. మద్యం సీసాలో మూత్రం పోసి.. 70 ఏళ్ల వృద్ధుడి చేత తాగించిన వైనం

Love Marriage Leads To Heinous Crime In Madhya Pradesh
  • వృద్ధుడిని కిడ్నాప్ చేసి, బలవంతంగా మూత్రం తాగించిన వైనం
  • ఈ అమానుష ఘటనను వీడియో తీసి వైరల్ చేసిన దుండగులు
  • వైరల్ వీడియోతో రంగంలోకి దిగిన పోలీసులు
మధ్యప్రదేశ్‌లో అత్యంత అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తమ కుమార్తెను ప్రేమ పెళ్లి చేసుకుని తీసుకెళ్లిపోయాడన్న కోపంతో యువతి కుటుంబ సభ్యులు.. 70 ఏళ్ల వృద్ధుడైన యువకుడి తండ్రిని కిడ్నాప్ చేసి, దారుణంగా కొట్టి, మద్యం సీసాలో మూత్రం పోసి బలవంతంగా తాగించారు. ఈ అమానుషాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

రైసెన్ జిల్లాకు చెందిన ఓ యువకుడు, విదిశ జిల్లాకు చెందిన యువతి మార్చి 5న ప్రేమ వివాహం చేసుకుని ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజే దీనిపై కేసు నమోదైంది. మార్చి 7న యువతి కుటుంబ సభ్యులు సుమారు 12 మంది రెండు వాహనాల్లో రైసెన్‌కు చేరుకున్నారు. యువతి ఆచూకీ చెప్పాలంటూ ఆమె ప్రియుడి తండ్రి అయిన వృద్ధుడిపై దాడి చేశారు.

అనంతరం, ప్రేమజంటను వెతుకుదామనే నెపంతో వృద్ధుడిని బలవంతంగా తమ వాహనాల్లో ఎక్కించుకుని రాజ్‌గఢ్ జిల్లాలోని మోతీపుర గ్రామంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వారి ఆచూకీ చెప్పకపోవడంతో, వృద్ధుడిని తీవ్రంగా కొట్టి, మద్యం సీసాలో మూత్రం పోసి బలవంతంగా తాగించారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.

ఈ ఘటన గత నెలలో జరగ్గా బుధవారం వీడియో వైరల్ కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన రాజ్‌గఢ్ పోలీసులు, బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నామని తెలిపారు. వీడియో ఆధారంగా మిగిలిన నిందితులను గుర్తించి, వారిని అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నామని పోలీసులు వివరించారు.
Go Back to Shorts
Madhya Pradesh Crime
Honour Crime
Kidnapping
Elderly Abuse
Viral Video
Love Marriage
Raisen District
Rajgarh Police
Crime Against Senior Citizen
Youth

More Telugu News