ఒకే ఛార్జ్‌పై 320 కి.మీ. రేంజ్.. ఓలా నుంచి కొత్త మోడల్‌ స్కూటర్ విడుదల!

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్, భారత మార్కెట్లోకి మరో కొత్త స్కూటర్‌ను తీసుకువచ్చింది. అధిక రేంజ్, అత్యుత్తమ పనితీరు లక్ష్యంగా S1 X+ 5.2 kWh వేరియంట్‌ను సోమవారం విడుదల చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల భారీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. దీని పరిచయ ధరను (ఎక్స్-షోరూం) రూ. 1,29,999గా నిర్ణయించింది. ఈ ప్రత్యేక ధర ఏప్రిల్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ కొత్త స్కూటర్లో ఓలా సొంతంగా, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ టెక్నాలజీతో కూడిన 5.2 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఇది గంటకు 125 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకోగలదు. 11 kW మిడ్-డ్రైవ్ మోటార్‌తో వస్తున్న ఈ స్కూటర్‌లో బ్రేక్-బై-వైర్ టెక్నాలజీ, ఫ్రంట్ డిస్క్ బ్రేకులు వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఓలా జనరేషన్ 3 ప్లాట్‌ఫామ్‌పై ఈ మోడల్‌ను నిర్మించారు.

ఈ విడుదలపై ఓలా ఎలక్ట్రిక్ ప్రతినిధి మాట్లాడుతూ. "S1 X+ 5.2 kWh మోడల్‌తో మా 4680 భారత్ సెల్ టెక్నాలజీని పెద్ద ఎత్తున సాధారణ మార్కెట్లోకి తీసుకువస్తున్నాం. మా అత్యంత అధునాతన ఉత్పత్తుల కోసం మేము నిర్మించిన టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌నే ఇప్పుడు విస్తృతమైన ఈవీ వినియోగాన్ని ప్రోత్సహించేలా రూపొందించిన స్కూటర్‌లో అందిస్తున్నాం" అని తెలిపారు.

"వర్టికల్ ఇంటిగ్రేషన్ (ఉత్పత్తి ప్రక్రియలో కీలక దశలన్నింటినీ సొంతంగా నిర్వహించడం) ద్వారానే ఇది సాధ్యమవుతుంది. లోతైన ఆవిష్కరణలు చేయడానికి, వేగంగా విస్తరించడానికి, మా అత్యుత్తమ సాంకేతికతను మరింత ఎక్కువ మంది కస్టమర్లకు వేగంగా అందించడానికి ఇది వీలు కల్పిస్తుంది. S1 X+ 5.2 kWh పనితీరు, రేంజ్, స్థాయిని ఒకచోట చేర్చింది. ప్రతి భారతీయుడికి ఈవీలను అందుబాటులోకి తెచ్చే మా ప్రయాణంలో ఇది మరో ముఖ్యమైన ముందడుగు" అని ఆయన వివరించారు. ఈ కొత్త మోడల్ విడుదలతో ఓలా పోర్ట్‌ఫోలియోలో మొత్తం తొమ్మిది స్కూటర్లు అందుబాటులోకి వచ్చినట్లయింది.

Ola Electric
Ola S1 X+
Electric Scooter
Ola Scooter
Electric Vehicle
EV Scooter
4680 Bharat Cell Technology
Electric Scooter Range
Ola Electric India

More Telugu News