ఖానాపూర్లో బీఆర్ఎస్తో జరిగిన పొత్తు కేవలం స్థానిక నాయకుల మధ్య అవగాహనే: రాంచందర్ రావు
తెలంగాణలో పొత్తుల అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కీలక ప్రకటన చేశారు. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించిన నేపథ్యంలో నిర్మల్లో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్తులో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే పోరాడుతుందని స్పష్టం చేశారు. ఖానాపూర్లో బీఆర్ఎస్తో జరిగిన పొత్తు కేవలం స్థానిక నాయకుల మధ్య కుదిరిన అవగాహన మాత్రమేనని, పార్టీ పరంగా ఎలాంటి అధికారిక పొత్తు లేదని ఆయన వివరణ ఇచ్చారు.
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహిళల హక్కులను పట్టించుకోలేదని మండిపడ్డారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా బీజేపీ అడుగులు వేస్తోందని, వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా ఏప్రిల్ 16న మహిళా రిజర్వేషన్ కోసం ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందని, రానున్న రోజుల్లో సొంత బలంతోనే అధికారం చేపడతామని రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా దేశ రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం లభిస్తుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.