రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు: కిషన్ రెడ్డి
- రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న కిషన్ రెడ్డి
- రైతులు ఇబ్బంది పడుతుంటే.. మంత్రులు ఏసీ రూముల్లో గడుపుతున్నారని విమర్శ
మార్పు పేరుతో దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రైతాంగం పట్ల నిర్లక్ష్యంగా, నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దళారులు, రైస్ మిల్లర్ల చేతుల్లో చిక్కి రైతులు విలవిలలాడుతుంటే, మంత్రులు ఏసీ రూముల్లో గడుపుతున్నారని మండిపడ్డారు.
ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనాన్ని కేంద్రంపై నెట్టేయాలని చూస్తున్నారని కిషన్రెడ్డి విమర్శించారు. కేంద్రం ఎప్పుడూ తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ ధాన్యాన్ని సేకరిస్తోందని స్పష్టం చేశారు. 52.24 లక్షల మెట్రిక్ టన్నుల ఒప్పందానికి గాను, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 51 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించగలిగిందని గణాంకాలను వెల్లడించారు.
ఇక్కడ పండే నాణ్యమైన సన్న బియ్యాన్ని ఎక్కువ ధరకు ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటూ, పేద ప్రజలకు మాత్రం ఇతర రాష్ట్రాల నుండి తెచ్చిన నాసిరకం బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కేవలం కమీషన్లు, భూ దందాలపైనే శ్రద్ధ పెడుతూ, రైతుల ఉసురు పోసుకుంటున్నాయని కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.