భారత్ తో భయంకరమైన యుద్ధాన్ని ఆపడం పట్ల పాక్ ఇప్పటికీ కృతజ్ఞతలు చెబుతోంది: ట్రంప్

Donald Trump claims stopping India Pakistan war averted millions of deaths
భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన పూర్తిస్థాయి యుద్ధాన్ని తాను ఆపడం వల్లే దాదాపు 5 కోట్ల మంది ప్రాణాలు నిలిచాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తాజా ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్ (SOTU 2026)’ ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తూ, ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో తన పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. పాకిస్థాన్ నాయకులు తనకు నిరంతరం కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

గతేడాది (2025) కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించింది. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరి, అణు యుద్ధం ముంగిట నిలిచాయని ట్రంప్ వివరించారు. ఆ క్లిష్ట సమయంలో తాను జోక్యం చేసుకోకపోతే పెను విధ్వంసం జరిగి ఉండేదని అన్నారు.

"భారత్, పాకిస్థాన్ మధ్య అణు యుద్ధం జరిగి ఉండేది. దానివల్ల 3 నుంచి 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయేవారు. ‘మీరు లేకపోతే నేను సహా 3.5 కోట్ల మంది చనిపోయేవారు’ అని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నాతో చెప్పారు" అని ట్రంప్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. తన మొదటి 10 నెలల పాలనలోనే భారత్-పాక్ ఘర్షణ సహా 8 యుద్ధాలను అంతం చేశానని గుర్తుచేశారు. ఆ ఘర్షణ సమయంలో 11 ఖరీదైన యుద్ధ విమానాలు కూలిపోయాయని కూడా ప్రస్తావించారు. పాక్ ప్రధాని తన చీఫ్ ఆఫ్ స్టాఫ్ ముందే తనకు బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారని ట్రంప్ ఉదహరించారు.

అయితే, ట్రంప్ వాదనలను భారత్ గతంలోనే తోసిపుచ్చింది. భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా ద్వైపాక్షిక చర్చల ద్వారానే జరిగిందని, ఇందులో ఎలాంటి మూడో పక్షం జోక్యం లేదని భారత విదేశాంగ శాఖ పలుమార్లు స్పష్టం చేసింది. 
Go Back to Shorts
Donald Trump
India Pakistan war
Operation Sindoor
Kashmir
Shahbaz Sharif
Nuclear war
India
Pakistan
SOTU 2026
Pahalgam

More Telugu News