భర్తపై కోపంతో భార్యను చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఒక అంగన్వాడీ ఉపాధ్యాయురాలిని చెట్టుకు కట్టేసిన ఘటనలో కంగ్టి పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. కంగ్టి మండలం రాసోల్‌లో ఈ ఘటన జరిగింది. అంగన్వాడీ ఉపాధ్యాయురాలి భర్త తమ నుంచి డబ్బులు తీసుకుని పారిపోయాడంటూ ఆమెను గ్రామస్థులు చెట్టుకు కట్టేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కంగ్టి మండలంలోని దామరగిద్ద గ్రామానికి చెందిన వసంతకుమారి రాసోల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వసంతకుమారి భర్త ప్రభాకర్ ఇటీవల హెచ్‌బీఎం ఫైనాన్స్ పేరుతో గ్రామానికి చెందిన అవుటి సాయవ్వ, చాకలి బాలమణి, భూతాలే వైద్యనాథ్, అవుటి బండ్యప్ప, కోటగిరి రాములు వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసి పారిపోయాడు.

తాము మోసపోయామని గుర్తించిన గ్రామస్థులు, రెండు రోజుల క్రితం అంగన్వాడీ విధులకు హాజరైన వసంతకుమారిని తాళ్లతో చెట్టుకు కట్టేశారు. జుట్టు కత్తిరించి గాడిదపై ఊరేగిస్తామని హెచ్చరించారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకోవడంతో విడిచిపెట్టారు. తనను చెట్టుకు కట్టేసి అవమానించారంటూ వసంతకుమారి కంగ్టి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Vasantha Kumari
Sangareddy
Telangana
Anganwadi teacher
Money fraud
Kangti
Rasool village

More Telugu News