కాకాణి గోవర్ధన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
నెల్లూరులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు చివరకు పోలీసు కేసు వరకు వెళ్ళాయి. ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణపై చేసిన వ్యాఖ్యలు, కార్యాలయంపై దాడికి యత్నించిన ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి ప్రయత్నించడం, సిబ్బందిని బెదిరించడం వంటి చర్యలకు కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్పడ్డారు. నిరసన సమయంలో బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడం, పోలీసులతో వాగ్వాదానికి దిగడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. "దమ్ముంటే, మగాళ్లు అయితే బారికేడ్లు దాటి రండి" అంటూ సిబ్బందిని ఉద్దేశించి కాకాణి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఈ నేపథ్యంలో, ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ కె.హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెల్లూరు పోలీసులు కాకాణిపై 189(2), 126(2), 79, 351(2) R/W 190 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.